సుదర్శన్ 35 ఎంఎం వైపే అందరి చూపు

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో చేసే ఛాన్స్ లేదని తేలిపోవడంతో టైటిల్ సెంటిమెంట్ ని ఫాలో అయిపోయి గుంటూరులో చేస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ రోజు దీనికి సంబంధించిన వివరాలు నిర్మాత నాగవంశీ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో ఏకంగా ప్రీమియర్ ఆడిస్తున్న రేంజ్ లో హంగామా చేసేందుకు డీజేలు, టపాసులతో అభిమానులు సిద్ధమయ్యారు.

ఆన్ లైన్ లోనూ ట్రైలర్ వస్తుంది కానీ సుదర్శన్ కు దానికి మధ్య కనీసం గంట గ్యాప్ ఉండొచ్చని తెలిసింది. అంచనాలకు సంబంధించి గుంటూరు కారం పోటీదారుల కంటే ముందంజలో ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పాటలు తప్ప సరైన వీడియో కంటెంట్ ఏదీ బయటికి రాలేదు. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరిని మాత్రమే రివీల్ చేశారు తప్పించి అసలైన క్యాస్టింగ్ ఇంకా చాలా ఉంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతిబాబు తదితరులంతా ట్రైలర్ లోనే దర్శనమివ్వబోతున్నారు. వీళ్ళ పాత్రలు ఎలా ఉంటాయో మొదటిసారి రివీల్ అయ్యేది ఇందులోనే. అందుకే ఇంత హైప్.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు టికెట్ రేట్లకు సంబంధించిన జిఓ ఇచ్చేస్తే వెంటనే బుక్ మై షో అమ్మకాలు మొదలైపోతాయి. ఇవాళ ట్రైలర్ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాకపోవచ్చు కానీ టీమ్ కు సంబంధించిన ముఖ్యమైన ఆరిస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. తమన్ హాజరు కావడం అనుమానమే. ట్రైలర్ లో మహేష్ బాబు ఊర మాస్, మాటల మాంత్రికుడి ట్రేడ్ మార్కు డైలాగులతో పాటు పీక్స్ హీరోయిజం ఉంటుందట. బాహుబలి రికార్డులకు దగ్గరగా వెళ్తామన్న నిర్మాత మాటకు మొదటి పునాది ఇక్కడే పడాలి మరి. చూద్దాం.