వావ్….మణిరత్నం క్లాసిక్స్ 8K క్వాలిటీలో

పాత సినిమాలు అందులోనూ క్లాసిక్స్ ని కాపాడుకోవడం ఏ భాషకైనా చాలా అవసరం. ముఖ్యంగా నెగటివ్స్ ని భద్రపరచడంతో పాటు వాటిని సరైన సమయంలో డిజిటల్ చేయకపోతే భవిష్యత్తులో బాధ పడాల్సి వస్తుంది. ఇప్పటికీ మాయాబజార్ పూర్తి నిడివి మంచి క్వాలిటీతో అందుబాటులో లేకపోవడం వల్లే కలర్ వెర్షన్ చేసినప్పుడు కొంత భాగం తీసేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మణిరత్నం ముందు జాగ్రత్త పడుతున్నారు. తన దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని ప్రసాద్ కార్పొరేషన్ సహాయంతో ఏకంగా 8K రెజోల్యూషన్ తో అప్ గ్రేడ్ చేయించి సిద్ధంగా ఉంచుతున్నారు.

వీటిలో దళపతి, దొంగ దొంగ, బొంబాయి, రోజా, గురు, ఇద్దరు. యువ, సఖి పూర్తయిపోయాయి. ఇప్పుడు రీ రిలీజుల్లో మనం చూస్తున్నవి 4కె క్వాలిటీనే. ఇప్పుడు ఏకంగా 8కె అంటే ఏ స్థాయిలో స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మాములుగా ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు దీని వల్ల కమర్షియల్ గా అందే లాభాలు ఉండకపోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఫిలిం మేకింగ్ గురించి నేర్చుకోవాలనుకునే దర్శకులకు, నిన్నటి తరంలోని గొప్ప చిత్రాల తాలూకు మాయాజాలాన్ని ఆస్వాదించేందుకు ఇవి ఉపయోగపడతాయి. దీనికి సంవత్సరాల తరబడి సమయం పట్టింది.

ఇక్కడితో అయిపోలేదు. మణిరత్నం మరికొన్ని క్లాసిక్స్ పెండింగ్ ఉన్నాయి. గీతాంజలి, అంజలి, ఘర్షణ, మౌన రాగం మొదలైనవి హక్కుల సమస్యతో పాటు నెగటివ్స్ కొరత వల్ల ఆలస్యమయ్యేలా ఉన్నాయి. తెలుగులోనూ ఇలాంటి ప్రయత్నాలు ఊపందుకోవాలి. గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్, రామకృష్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు నడుం బిగించాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూత్రాన్ని అనుసరించి వీలైనన్ని సినిమాలను రీ స్టోర్ చేసే పనిని ప్రారంభించాలి. బాలీవుడ్ ఈ విషయంలో ముందంజలో ఉంది. గత ఏడాది మల్టీప్లెక్సుల్లో చాలా క్లాసిక్స్ ని రీ రిలీజ్ చేసి అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి.