ఐఎండీబీ టాప్ 250 – మన తెలుగు సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా రేటింగ్స్, రివ్యూలకు అత్యంత ప్రామాణికంగా నిలిచే ఐఎండిబి నుంచి టాప్ 250 భారతీయ సినిమాల జాబితా విడుదలైంది. అందులో మహేష్ బాబు, రాజమౌళి, అడవి శేష్ లవి చెరో మూడు చిత్రాలు ఉండగా అసలు ఒక్కటి కూడా లేని టాలీవుడ్ స్టార్లు వాటిలో ఉండటం గమనార్హం. టాలీవుడ్ టాప్ ర్యాంక్ 14వ స్థానం కేరాఫ్ కంచరపాలెం దక్కించుకోగా ఆపై వరసగా జెర్సీ(19), మాయాబజార్ (23), సీతారామం(26), నువ్వు నాకు నచ్చావ్(37), ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(50), సత్య(51), మహానటి(54), బాహుబలి కంక్లూజన్(109), బొమ్మరిల్లు (128)లు తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి.

రంగస్థలం(135), అతడు(142), పెళ్లి చూపులు(150), క్షణం(159), ఎవరు(165), మేజర్(176), వేదం(184), బాహుబలి బిగినింగ్(191), అర్జున్ రెడ్డి(200), పోకిరి(220), ఒక్కడు(223), ఊపిరి(227), మనం(229), లీడర్(232), ఆర్ఆర్ఆర్(236), హ్యాపీ డేస్(240) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే కేవలం వీటి ఆధారంగా బెస్ట్ మూవీస్ అనే ట్యాగ్ ఇవ్వలేం. ఎందుకంటే ఐఎండిబి అనేది నెటిజెన్లు అందులోనూ ఈ వెబ్ సైట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే రేటింగ్స్ ఇస్తారు. సాధారణ జనాలకు వీటి మీద పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి వీటినే ప్రాతిపదికన తీసుకోలేం.

కె విశ్వనాథ్, దాసరినారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి ఎందరో దిగ్గజాలు తీసిన క్లాసిక్స్ ఈ లిస్టులో లేవు. పైగా వాటి గురించి తెలిసిన సాఫ్ట్ వేర్ బ్యాచ్ తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కెజిఎఫ్ మీద విమర్శలతో మొదలుపెట్టి ఫిలిం మేకింగ్ మీద కామెంట్లు చేసి ట్విట్టర్ వివాదాల్లో ఇరుక్కుని ఏకంగా సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చిన వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం టాప్ లో ఉండటం అసలు ట్విస్టు. అందరికంటే ఎక్కువ అడవి శేష్ ఈ జనరేషన్ తో ఎంతగా కనెక్ట్ అయ్యాడో చెప్పేందుకు అతని మూడు సినిమాలు చోటు దక్కించుకోవడమే సాక్ష్యం.