డెవిల్ అసలు దర్శకుడు లైన్లోకి వచ్చాడు

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రాల్లో డెవిల్ ఒకటి. 1940 దశకంలో బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించారు. డెవిల్ టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అనిపించాయి. సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఇంకో రెండు రోజుల్లో డెవిల్ రిలీజ్ కాబోతోంది. అయితే ‘డెవిల్’ రైటింగ్, డైరెక్షన్ క్రెడిట్ విషయంలో కొన్ని నెలలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది. కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ సినిమా రిలీజ్ సమయానికేమో నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. ఇప్పటిదాకా రైటింగ్, డైరెక్షన్‌లో ఎలాంటి అనుభవం లేని నిర్మాత.. ఉన్నట్లుండి ఎలా దర్శకుడు అయిపోయాడో జనాలకు అర్థం కావడం లేదు.

టీజర్ లాంచ్ అయినప్పుడు దర్శకుడిగా నవీన్ పేరు తీసేసినప్పటికీ టెక్నికల్ టీంలో తన పేరు ఉంది. కానీ తర్వాత పూర్తిగా ఆ పేరును ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. మొన్నటిదాకా ఈ ప్రాజెక్టులో ఏ మాత్రం భాగస్వామ్యం లేని శ్రీకాంత్ విస్సా రిలీజ్ టైంకి స్క్రిప్ట్ క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు. డెవిల్ దర్శకుడి మార్పు విషయమై కళ్యాణ్ రామ్ సహా టీంలో ఎవరూ మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. చివరికి నవీన్ సైతం ఈ వివాదంపై ఇన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నాడు. కానీ రిలీజ్ ముంగిట అతను మౌనం వీడాడు.

డెవిల్ సినిమాకు తనే దర్శకుడినని, స్క్రిప్ట్ దశ నుంచి అన్ని తానై వ్యవహరించానని.. 105 రోజుల పాటు ఈ సినిమాను వివిధ లొకేషన్లలో చిత్రీకరించానని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నవీన్ మేడారం. ఎవరేమనుకున్నా డెవిల్ తన ప్రోడక్ట్ అని.. దాన్ని ఒక బిడ్డలా చూస్తానని నవీన్ తెలిపాడు. కొందరి ఇగో వల్ల తాను దర్శకుడి స్థానం నుంచి వైదొలగాల్సి వచ్చిందని అతను తెలిపాడు. ఈ క్రమంలో హీరో కళ్యాణ్ రామ్ మీద ప్రశంసలు కురిపించడం విశేషం. డెవిల్ బ్లాక్ బస్టర్ కావాలని అతను ఆకాంక్షించాడు. ప్రస్తుతం తాను వేరే ప్రాజెక్టు పని చేస్తున్నానని, దాని స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని నవీన్ తెలిపాడు. మరి నవీన్ పోస్ట్ విషయంలో అభిషేక్ నామా, ఇతర డెవిల్ టీం సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.