ఓటిటి ప్రపంచంలో పూజా హెగ్డే ఎంట్రీ

ఇప్పుడు కాస్త ఫామ్ తగ్గింది కానీ మొన్నటిదాకా హీరోయిన్ పూజా హెగ్డే డిమాండ్ ఏ స్థాయిలో ఉండేదో తెలియంది కాదు. గుంటూరు కారం ఒప్పుకున్నాక తప్పిపోవడం ఫ్యాన్స్ ని ఇప్పటికీ బాధ పెడుతోంది. అది కాస్తా శ్రీలీలని వరించడం ఇంకాస్త పెంచింది. దీని సంగతలా ఉంచితే త్వరలో ఈ డీజే భామ డిజిటల్ డెబ్యూ చేయబోతోంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓటిటి వర్గాల టాక్. కోలీవుడ్ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ సిద్ధమయ్యిందని వినికిడి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ అజయ్ జ్ఞానముత్తు ఎవరంటే విక్రమ్ కోబ్రా, నయనతార ఇమైక్క నొడిగళ్(తెలుగులో అంజలి సిబిఐ) తీసింది ఇతనే. హారర్ జానర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన డిమాంటీ కాలనీతో డెబ్యూ చేశాడు. ఇప్పుడు దీని సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోయే మూవీ హారర్ కం థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని వినికిడి. పూజా హెగ్డే చుట్టే కథ రాసుకున్నాడట. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలకే పరిమితమైన పూజాకు ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కడం మంచిదే. తనలో ఉన్న అసలైన నటిని బయటికి తీసుకొచ్చే అవకాశం వెబ్ వరల్డ్ లోనే ఉంటుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే వరస డిజాస్టర్ల తర్వాత పూజా కెరీర్ బాగా డిఫెన్స్ లో పడిపోయింది. ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ లు డిజాస్టర్లు కాగా హిందీలో కిసీకా భాయ్ కిసీకా జాన్, సర్కస్ లు ట్రోలింగ్ కు గురయ్యేంత దారుణంగా ఫెయిలయ్యాయి. అల వైకుంఠపురములో తర్వాత కెరీర్ మరీ ఇంత కుదుపులకు లోనవుతుందని ఊహించి ఉండదు. పోటీదారుగా ఉన్న రష్మిక మందన్న యానిమల్ బ్లాక్ బస్టర్ తో తిరిగి రేస్ లోకి వచ్చేసింది. చేతిలో పుష్ప 2తో పాటు మరో మూడు సినిమాలున్నాయి. స్పీడ్ పెంచాల్సింది పూజానే. ఈ మధ్య హైదరాబాద్ లో కాకుండా ముంబైలోనే ఎక్కువ ఉంటోంది.