శౌర్యాంగ పర్వం ముందు ఎన్నో ప్రశ్నలు

సలార్ 1కి సీజ్ ఫైర్ లాగా పార్ట్ 2 సీక్వెల్ కి శౌర్యాంగ పర్వం పేరుని ఫిక్స్ చేసి ఆ మేరకు సినిమా చివర్లో కార్డు వేసిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ దీంట్లో ఎన్నో చిక్కుముడులను విప్పాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది దేవా తండ్రి ఎవరనేది. బాహుబలి తరహాలో ఈ పాత్ర కూడా ప్రభాసే చేశాడని, చాలా సర్ప్రైజింగ్ గా ఆ క్యారెక్టర్ ఉంటుందని గతంలోనే లీక్ వచ్చింది. కానీ ఈశ్వరి రావు భర్త ఎవరనేది గుర్తుకు రాకుండా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేశారు. ఇక హీరోయిన్ శృతి హాసన్ ని విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది.

జగపతిబాబుకి సీజ్ ఫైర్ లో ఊహించినంత స్పేస్ దక్కలేదు. సో ఆయన ఇప్పుడు కీలకం కాబోతున్నారు. వరదరాజగా నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ స్నేహితుడికి మీద అంత ప్రేమను పెంచుకున్నప్పుడు తన జాతికి జరిగిన ద్రోహం గురించి దేవా ఎందుకు నిలదీయలేదనే లాజిక్ సలార్ 2లోనే తెలియాల్సి ఉంది. పైగా ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం వేరే ఉంది. కులాల మధ్య వైరాన్ని చూపించారు కానీ అవి ఎంత లోతుగా ఉండేవన్నది క్లారిటీ ఇవ్వాలి. దేవాకు ఆద్య మీద ప్రేమ కలిగిందో లేదో చెప్పలేదు. స్పెషల్ సాంగ్ ఏమైనా ఈసారి ఉందో లేదో చూడాలి.

చెప్పుకుంటూ పోతే ఇతర అంశాలు స్పాయిలర్స్ అవుతాయి కానీ సీజ్ ఫైర్ కన్నా ఎక్కువ కంటెంట్ శౌర్యాంగ పర్వంలోనే ఉండబోతోందనేది వాస్తవం. వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో ప్యాన్ ఇండియా మూవీ కమిటైన ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. దేవర, వార్ 2లో ఏమైనా ఆలస్యం జరిగితే తప్ప నీల్ ఫ్రీ కాలేడు. సలార్ 2 స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందట. హోంబాలే ఫిలిమ్స్ ఈసారి బడ్జెట్ ని మరింత పెంచి నెవర్ బిఫోర్ యాక్షన్ గ్రాండియర్ గా ఆ సినిమా తీసేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది.