తారక్ అభిమానులు పిచ్చ హ్యాపీ

సందర్భం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యే సందర్భం ఏమొచ్చిందని అనుకుంటున్నారా. దేవర గురించి కాదు లెండి. సలార్ టాక్ చూసిన వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. అది ప్రభాస్ మీద సాఫ్ట్ కార్నర్ వల్ల కాదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తర్వాత చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ తమ హీరోతోనే కాబట్టి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ సినిమా 2024 వేసవిలో సెట్స్ పైకి వెళ్తుందని కొన్ని వారాల క్రితం నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. నీల్ ఫలానా టైం అని ఖచ్చితంగా చెప్పలేదు కానీ త్వరలోనే ఉంటుందనే సూచనలు ఇచ్చాడు.

అతి తక్కువ డైలాగులతో ప్రభాస్ ని అంత పవర్ ఫుల్ గా ఎలివేట్ చేసిన నీల్ మాటలే తూటాలుగా వదిలే యంగ్ టైగర్ ని ఎలాంటి పాత్రలో చూపిస్తాడోననే ఉత్సుకత కలగడం సహజం. అయితే నలుపు రంగు, బొగ్గు గనులు, బానిసలు లాంటివి లేకుండా ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తానని నీల్ చెప్పిన మాట తెలిసిందే. అదే నిజమైతే ఎప్పుడూ చూడని మరో ఆవిష్కరణకి సిద్ధపడవచ్చు. ప్రస్తుతానికి స్టోరీ లైన్ ఓకే అనుకోవడం తప్ప ఇంకా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాలేదని వినికిడి. రఫ్ కాపీతో మొదలుపెట్టి సెట్స్ మీద అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం నీల్ కు అలవాటే.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర 1 పూర్తి చేశాక వార్ 2 సెట్లో అడుగు పెడతాడు. ఆ తర్వాత నీల్ మూవీ ఉంటుంది. సలార్ 2 ఎప్పుడు ప్లాన్ చేస్తారనే సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగుతోంది. ఫస్ట్ పార్ట్ ఫలితాన్ని బట్టి డిసైడ్ చేస్తామని నిర్మాత గతంలోనే అన్నారు. ఇప్పుడు రెస్పాన్స్ చూశాక ముందడుగు వేయడం ఖాయం. అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ ని చూసి అయిదేళ్ళవుతున్న నేపథ్యంలో అభిమానులకు వరసగా సినిమాలు అందించేందుకు తారక్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వచ్చే ఏడాది దేవర, 2025 ఆగస్ట్ లో వార్ 2 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.