బిగ్ బాస్ లక్ష్యం పక్కదారి పడుతోంది

ఎన్నడూ లేనిది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఆట పూర్తయ్యాక కూడా వార్తల్లో వాడివేడిగా నిలుస్తోంది. విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, ఓ రెండు మూడు రోజులు అతను అజ్ఞాతంలోకి వెళ్లడం, పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడం, రెండు వారాల రిమాండ్ విధించడం లాంటి పరిణామాలు సినిమా డ్రామాని మించిపోయాయి. రైతు బిడ్డ అంటూ సానుభూతి కార్డు ప్లే చేసి చాలా ప్రయోజనం పొందాడంటూ కొందరు, పైకి వస్తున్న వాడిని తొక్కేస్తున్నారని మరికొందరు ఇలా ఎవరికి తోచిన వాదనలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు.

ఇదంతా పబ్లిసిటీ పరంగా ఓకే కానీ ఈ తరహా మైలేజ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ఖచ్చితంగా కోరుకోరు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా ఈ గేమ్ షో ఆపాలంటూ కేసు వేస్తే పల్లవి ప్రశాంత్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తారు. సాక్ష్యాలుగా వీడియోలు, ఫోటోలు బోలెడుంటాయి. సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగినా పర్వాలేదు కానీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్, న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వస్తుందో ఆసలు సమస్య అక్కడ వస్తుంది. బయట జరిగింది కాబట్టి టెక్నికల్ గా సదరు ఛానల్ మేనేజ్ మెంట్ కి సంబంధం లేకపోవచ్చు కానీ ఈ రచ్చ మూలం మొదలయ్యిందే హౌస్ లో కాబట్టి కాదని అనలేం.

నెక్స్ట్ సీజన్ 8 మీద దీని ప్రభావం ఉంటుంది. నాగార్జున చేయకపోవచ్చనే టాక్ ఫైనల్ కు ముందే వినిపించింది. బాలకృష్ణతో మాట్లాడుతున్నారనే వార్త చక్కర్లు కొట్టింది. కానీ ఇదంతా చూశాక ఎవరి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. పిఆర్ ల సహాయంతో పార్టిసిపెంట్స్ చేస్తున్న హంగామా, అభిమానుల పేరుతో కొందరు ఫాలోయర్స్ చేస్తున్న రాద్ధాంతం క్రమంగా ఈ షో మీద నీలినీడలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అయినా ఇన్ని సీజన్ల గెలిచిన ఏ విన్నరూ సూపర్ స్టారో ఆన్ లైన్ స్టారో అయిపోలేదు. ఇదంతా సీజనల్. ఈ సత్యం గుర్తుంచుకుంటే ఈ సమస్యలే రావేమో.