యానిమల్ పార్క్ వైపు సందీప్ అడుగులు

బాలీవుడ్ బాక్సాఫీస్ ని సునామిలా కమ్మేసిన యానిమల్ ప్రస్తుతం నెమ్మదించినా ఇప్పటికే 800 కోట్ల వసూళ్లకు దగ్గరగా వెళ్ళిపోయి రన్బీర్ కపూర్ పెట్టుకున్న సూపర్ స్టార్ ట్యాగ్ కు న్యాయం చేకూర్చింది. కంటెంట్ మీద రిలీజ్ రోజు నుంచి ఇవాళ్టి దాకా ఎన్నెన్నో కామెంట్లు, డిస్కషన్లు జరిగినా వాటిని లెక్క చేయకుండా దూసుకుపోయిన వైనం తలను పండిన విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒకరకంగా సెన్సార్ ఇచ్చే ఏ సర్టిఫికెట్ పరిమితుల్లో స్టార్ హీరోలతో కథలను ఎంత దూరం తీసుకెళ్ళొచ్చో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మంచి ఉదాహరణగా నిలిచాడు. కథ ఇక్కడితో అయిపోలేదు.

సందీప్ తర్వాతి ప్యాన్ ఇండియా మూవీ ప్రభాస్ స్పిరిట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రారంభం కావడానికి ఇంకో ఏడాదికి పైగానే టైం పట్టేలా ఉండటంతో ఈ లోగ యానిమల్ పార్క్ తీసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు ముంబై టాక్. యానిమల్ అంత భారీ బడ్జెట్ తో కాకపోయినా తక్కువ టైంలో పూర్తి చేసేలా ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడని వినికిడి. సీక్వెల్ కి సంబంధించిన హింట్ యానిమల్ ఎండ్ టైటిల్స్ తర్వాత ఇచ్చిన సందీప్ అందులో ఇంకో రన్బీర్ కపూర్ ని విపరీతమైన హింసతో పరిచయం చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడా పాత్రనే లీడ్ రోల్ గా మారుస్తాడట.

ప్రస్తుతానికి ఇదింకా చర్చల దశలోనే ఉంది. టి సిరీస్ సంస్థ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నా స్క్రిప్ట్ లాక్ చేసే దాకా ఏదీ చెప్పలేనని సందీప్ అన్నట్టు సమాచారం. ఒకవేళ కుదిరితే మాత్రం రామాయణం కన్నా ముందు రన్బీర్ కపూర్ దీనికి డేట్లు ఇస్తాడు. ఫస్ట్ పార్ట్ లో బాబీ డియోల్ తప్ప ఎవరూ చనిపోలేదు కాబట్టి అనిల్ కపూర్ తో సహా అందరినీ కంటిన్యూ చేయొచ్చు. అయితే బాడీ డబుల్ కాన్సెప్ట్ తో మరో ఆబ్రార్ ని సృష్టించినా ఆశ్చర్యం లేదని సందీప్ సన్నిహితుల కామెంట్. ఒక్క యానిమల్ కే బాక్సాఫీస్ షేక్ అయిపోతే ఇక పార్క్ అంటే ఈ కల్ట్ డైరెక్టర్ సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో.