రఘురాముడిగా మారబోతున్న క్రూర జంతువు

యానిమల్ విడుదలకు ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేసి రన్బీర్ కపూర్ ని మోయడం చూసి చాలా మంది అతిశయోక్తి అనుకున్నారు. తీరా తెరమీద అతని నటన చూశాక ఇప్పటి తరంలో ఆ స్థాయి పెర్ఫార్మన్స్ ఇచ్చేవాళ్ళు దరిదాపుల్లో కూడా లేరనే విషయం అందరికీ అర్థమైపోయింది. దానికి తోడు కేవలం రెండు వారాల లోపే ఏడు వందల కోట్ల వసూళ్లు దాటించి షారుక్ ఖాన్ కే సవాల్ విసిరే రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాడు. ముందు వెనుకా చూడకుండా ఫ్యామిలీ కోసం ఎంత నరమేధానికి అయినా సిద్ధపడే పాత్రలో రన్బీర్ కాకుండా ఇంకెవరినైనా ఊహించుకోవడం కష్టం.

ఇంత వయొలెంట్ రూపం కళ్ళముందు ఉండగానే రన్బీర్ కపూర్ త్వరలో రఘురాముడిగా మారబోతున్నాడు. దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త నాలుగైదు నెలల క్రితమే వచ్చినప్పటికీ నిర్ధారణగా ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు స్వయంగా హీరోనే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో ఇంకెలాంటి అనుమానం లేదు. రెండు లేదా మూడు భాగాలుగా ఇది ఉంటుందని ముంబై టాక్.

ఒక యాక్టర్ కి కావాల్సిన ట్రాన్స్ ఫర్మేషన్ రన్బీర్ కపూర్ అతి తక్కువ టైంలో దొరకడం అతని అదృష్టమే. మూడేళ్ళుగా రామాయణం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రభాస్ ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలు చూశాక అలాంటి పొరపాట్లకు ఎలాంటి తావు లేకుండా నితీష్ ప్రతిదీ జాగ్రతగా చూసుకుంటున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ ని తీసుకున్నారనే న్యూస్ ఉంది కానీ అఫీషియల్ గా చెప్పే దాకా నమ్మలేం. దీంతో పాటు రన్బీర్ చేతిలో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్ ఉంటుంది. అందులో రణ్వీర్ సింగ్ కూడా భాగం అవుతాడట. రాముడిగా రన్బీర్ బాగా నప్పుతాడు. మరి ఎలా మెప్పిస్తాడో చూడాలి.