టాలీవుడ్ దెబ్బకు హిందీ విలన్ల డిమాండ్

తెలుగు సినిమాలకు విలన్ల కొరత తీరడం కోసం దర్శకులు క్రమంగా ఇతర బాషల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడం తీవ్రతరం చేశారు. ఇటీవలే భగవంత్ కేసరిలో ‘అర్జున్ రామ్ పాల్’ పాత్ర రెగ్యులర్ షేడ్స్ లో ఉన్నా అతను పోషించడం వల్ల డిఫరెంట్ షేడ్ వచ్చింది. యానిమల్ లో అబ్రార్ గా మాటలే లేకుండా క్రూరత్వాన్ని పలికించిన ‘బాబీ డియోల్’ బాలకృష్ణ 109లో ఛాన్స్ కొట్టేశాడు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో ఔరంగజేబుగా మరో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ రెండూ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న క్రేజీ చిత్రాలే.

ప్రభాస్ మారుతీ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఆల్రెడీ ‘సంజయ్ దత్’ లాకైపోయాడు. ఇటీవలే ఫోటో షూట్ చేసుకుని ఓకే చేసుకున్నారు. కెజిఎఫ్, లియో తాలూకు ఎఫెక్ట్ ఇది. ఆదిపురుష్ తో మనకు పరిచయమైన ‘సైఫ్ అలీ ఖాన్’ తారక్ దేవరలో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘జాకీ శ్రోఫ్’ ఎప్పటి నుంచో నటిస్తున్నప్పటికీ తనకు ఇక్కడ సరైన బ్రేక్ దక్కలేదు. ‘వివేక్ ఒబెరాయ్’ వినయ విధేయ రామ తర్వాత ఇక్కడ అంతగా ఆసక్తి చూపించడం లేదు. మహేష్ మంజ్రేకర్ లాంటి సీనియర్లు అడపాదడపా కనిపిస్తున్నారు. నానా పాటేకర్ కాలాలో కనిపించాక మళ్ళీ సౌత్ లో చేయలేదు. జాన్ అబ్రహం, సునీల్ శెట్టిలను మనోళ్లు రెండుమూడు సార్లు ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు.

ఇప్పుడీ పరిణామాల పుణ్యమాని హిందీ విలన్లు భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. కనీసం కోటి రూపాయల నుంచి వీళ్ళ ధర మొదలవుతోంది. బాబీ డియోల్, సంజయ్ దత్ ల కోసం కనీసం అయిదు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు పారితోషికం మరింతగా పెరిగింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీశర్మ లాంటి లోకల్ విలన్లు మనోళ్లకు బోర్ కొట్టేస్తున్నారు. అందుకే కొత్తదనం కోసం దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగనుంది. త్వరలో ఒక పెద్ద స్టార్ హీరో ప్యాన్ ఇండియా మూవీ కోసం అనిల్ కపూర్ ని అడిగారట కానీ ఆయన ససేమిరా అన్నట్టు వినికిడి.