గేమ్ చేంజర్ పై ఫుల్ క్లారిటీ

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా విపరీతంగా ఆలస్యం అవుతుండడంపై అభిమానులు ఎంతగా ఆందోళన, ఆవేదన చెందుతున్నారో తెలిసిందే. పలుమార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డాక ఇటీవలే పునః ప్రారంభం అయింది. మైసూరులో షూట్ జరుగుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే సినిమా ప్రస్తుతం ఏ దశలో ఉంది.. ఎప్పటికి పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై క్లారిటీ లేదు. దిల్ రాజు కూడా ఈ విషయంపై ఏమి చెప్పలేని స్థితిలో కనిపించాడు ఆ మధ్య. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రాక్ లో పడ్డట్లే కనిపిస్తోంది ఆయన తాజా మాటల్ని బట్టి చూస్తుంటే.

తాను డిస్ట్రిబ్యూట్ చేసిన యానిమల్ సినిమాకు ఓపెనింగ్స్ రావడం పై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దిల్ రాజు.. గేమ్ చేంజర్ కు సంబంధించి అభిమానులు కోరుకున్న అప్ డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమా షూట్ 15 రోజులుగా మైసూర్లో జరుగుతున్నట్టు దిల్ రాజు.. 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్టు తెలిపాడు. సినిమా చివరి దశలో ఉందని వీలైనంత త్వరగా పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. రాజమౌళి.. సుకుమార్.. సందీప్ వంగ.. శంకర్ లాంటి దర్శకులు మేకింగ్ విషయంలో ఎక్కువ టైం తీసుకుంటారని.. తాము అనుకున్నది వచ్చేవరకు రాజీపడరని.. అలాంటి దర్శకులను మనం డెడ్ లైన్లు పెట్టి తొందర చేయలేమని దిల్ రాజు అన్నాడు.

శంకర్ ఉదయం 8 నుంచి రాత్రి పదిన్నర వరకు కష్టపడుతున్నాడని.. సినిమాను వేగంగా పూర్తి చేయడానికి.. ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ఆయన శ్రమిస్తున్నాడని దిల్ రాజు తెలిపాడు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఇప్పుడే ఏమి చెప్పలేమని.. చిత్రీకరణ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత టైం పడుతుందో చూసుకుని విడుదల తేదీపై ఒక నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.