తలలు నరికే ఊర మాస్ ‘రత్నం’

ఒకప్పుడు పందెం కోడి, పొగరు లాంటి సూపర్ హిట్లతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విశాల్ కు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో హిట్టు లేకుండా పోయింది. తమిళంలో వంద కోట్లు సాధించిన మార్క్ ఆంటోనీ సైతం మన దగ్గర బోల్తా కొట్టడం విచిత్రం. అభిమన్యుడు తప్ప చాలా కాలం నుంచి సక్సెస్ అందని ద్రాక్షే అయ్యింది. తాజాగా రత్నంగా వస్తున్నాడు. సింగం లాంటి మాస్ పోలీస్ కథలతో మెప్పించిన దర్శకుడు హరితో చేతులు కలిపాడు. ఇందాక కాన్సెప్ట్ ని పరిచయం చేసే రెండు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ ని రిలీజ్ చేశారు. 2024 వేసవిలో రత్నం రానుంది.

ఒక పెద్ద మైదానంలో దున్నపోతులు, గుర్రాలు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య లారీ నుంచి దిగి తన కోసం ఎదురు చూస్తూ మోకాలి మీద కూర్చున్న ఒక దుండగుడి తల నరికి దాన్ని చేత్తో పట్టుకుని విశాల్ నడిచి వచ్చే సీన్ ని ఈ వీడియోలో చూపించారు. కథను రివీల్ చేయలేదు కానీ విశాల్ చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ ఫ్యాక్షన్ స్టోరీ చేసినట్టు కనిపిస్తోంది. మాములుగానే దర్శకుడు హరిది లౌడ్ హీరోయిజం. గట్టి గట్టిగా కేకలు వేయిస్తూ, సవాళ్లు విసిరిస్తూ హీరో విలన్ మధ్య డ్రామాని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారు. రత్నం కూడా అదే స్టైల్ లోనే ఉండబోతోందని అర్ధమవుతోంది.

విశాల్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. లాఠీ, సామాన్యుడు, ఎనిమి, చక్ర, యాక్షన్ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో ఆశలన్నీ రత్నం మీదే పెట్టుకున్నాడు. మిస్కిన్ తో గొడవపడి ఆపేసిన డిటెక్టివ్ 2ని త్వరలో తన స్వీయ దర్శకత్వంలోనే ప్లాన్ చేసుకున్నాడు. మన దగ్గర పట్టు తప్పినా త్వరలో రత్నంతో కంబ్యాక్ అవ్వొచ్చని నమ్ముతున్నాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యాక్షన్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సముతిరఖని, గౌతమ్ మీనన్., యోగిబాబు ఇతర తారాగణం. తీవ్రమైన పోటీ ఉండటంతో రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు.

https://www.youtube.com/watch?v=r4pJXgZtdTs