ఆ సినిమా కోసం సుకుమార్ రంగంలోకి

గత ఏడాది ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్. ‘హుషారు’ లాంటి యూత్ ఫుల్ మూవీతో హిట్ కొట్టిన హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాను సూపర్ అనలేం. అలా అని తీసిపడేయనూలేం. ఆశిష్‌లో మంచి ఈజ్ ఉందనే పేరొచ్చింది ఈ సినిమాతో.

తర్వాత ఆశిష్ ‘సెల్ఫిష్’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘లవ్ టుడే’తో అందరి దృష్టిలో పడ్డ తమిళ హీరోయిన్ ఇవానా ఇందులో ఆశిష్‌కు జోడీగా ఎంపికైంది. దిల్ రాజు బేనర్లోనే కాశీ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. కొన్ని నెలల కిందటే ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. షూటింగ్ కూడా చకచకా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో ఏమైందో ఏమో ఈ సినిమాను తాత్కాలికంగా ఆపారు అనే వార్త బయటికి వచ్చింది.

స్క్రిప్టు అంతా బాగానే ఉన్నప్పటికీ టేకింగ్ విషయంలో ఏదో తేడా వచ్చిందని అంటున్నారు. దర్శకుడు కొత్తవాడు కావడం, అనుభవం లేకపోవడంతో టేకింగ్ పరంగా ఇబ్బంది పడ్డాడంటున్నారు. స్క్రిప్టు మీద ఉన్నది తెర మీదికి అనుకున్నంత బాగా రాలేదట. బడ్జెట్ పరంగా ఏ రకమైన ఇబ్బందులూ లేకపోయినప్పటికీ.. ఒక ఫీచర్ ఫిలింలో కనిపించాల్సిన రిచ్‌నెస్ రాలేదని తెలుస్తోంది. దర్శకుడు కాశీ సుకుమార్ అసిస్టెంట్ కావడం గమనార్హం. కొన్నేళ్ల నుంచి సుక్కు శిష్యుల ఆధిపత్యం నడుస్తోంది టాలీవుడ్లో. ఆయన అసిస్టెంట్ అంటే నమ్మకంగా సినిమా ఇస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు ‘ఉప్పెన’తో సంచలనం రేపి ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్‌తో సినిమా తీస్తున్నాడు. కాశీ కూడా టాలెంటెడ్ అన్నది సుక్కు టీం మాట.

ఐతే అనుభవ లేమితో కొంచెం తడబడి ఉండొచ్చు. ఈ సినిమాను సరి చేయడానికి సుక్కు రంగంలోకి దిగనున్నారట. తన శిష్యుడి సినిమా ఆగిందంటే సుక్కుకి కూడా ఇబ్బందే. అందుకే ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొంచెం వీలు చేసుకుని ఈ సినిమా రష్ చూడబోతున్నారట. స్క్రిప్ట్, టేకింగ్ పరంగా కరెక్షన్లు సూచించి.. సినిమాను తిరిగి పట్టాలెక్కించడానికి ఆయన ఒక చేయి వేయబోతున్నట్లు సమాచారం.