త్రివిక్రమ్ మౌనానికి అదే కారణం

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కి నిర్మాత నాగవంశీనే అయినా ఆ సంస్థ తీసే సినిమాలకు సంబంధించిన కీలక విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. కథతో మొదలుపెట్టి ప్రమోషన్ల దాకా అవసరమున్న చోట ఆయన దగ్గరుండి చూసుకుంటూ సలహాలు సూచనలు ఇస్తుంటారు. సర్, మ్యాడ్ లకు తన రచన, పర్యవేక్షణ లేకపోయినా సరే ఆయా దర్శకులతో కూర్చుని చర్చలు చేసి అవసరమైన మేర కరెక్షన్లు, ఇంప్రూవ్ మెంట్లు ఇచ్చారనేది తెలిసిన విషయమే. అయితే ఆదికేశవ ప్రాజెక్టులో మాత్రం త్రివిక్రమ్ ముందు నుంచీ ఆంటీ అంటనట్టే ఉన్నారు.

దీని గురించి ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఆదికేశవని వైష్ణవ్ తేజ్ తొలుత ఓకే చేసినప్పుడు సితార భాగస్వామ్యం లేదట. కొంత భాగం అయ్యాక ముందుకు కదలకపోవడంతో పవన్ సూచన మేరకు నాగవంశీ టేకప్ చేసినట్టు చెబుతున్నారు. కథ, స్క్రిప్ట్ విన్న త్రివిక్రమ్ అందులో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గుంటూరు కారం పనుల ఒత్తిడి వల్ల ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోవడంతో అలాగే ప్రొసీడ్ అయ్యారట. కొన్నిసార్లు ఎంత రొటీన్ మాస్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఆ రకమైన నమ్మకంతో ముందుకెళ్ళిపోయి పూర్తి చేశారు.

తీరా చూస్తే ఫలితం తేడా కొట్టేసింది. ఆదికేశవకు మెగా హీరోలను, త్రివిక్రమ్ ను తీసుకొచ్చి ఓ ఈవెంట్ చేసే ఛాన్స్ ఉన్నా వాడుకోలేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో సరిపెట్టేశారు. ముందే ఏం జరుగుతుందో ఊహించడం వల్లేనని ఎవరైనా కామెంట్ చేస్తే కాదనలేని పరిస్థితి. అంతెందుకు కలర్స్ స్వాతి కోసం ట్రైలర్ లాంచ్ కు వచ్చిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడి ఆదికేశవకు ట్వీట్ తో సరిపెట్టేశాడు కానీ ఏదైనా కాంబో వీడియో లాంటిది చేయలేదు. చిరంజీవి సైతం రిలీజప్పుడు విష్ చేస్తూ ట్వీట్ కూడా వేయలేదు. అలాంటప్పుడు త్రివిక్రమ్ మౌనంగా ఉండిపోవడంలో కారణం, న్యాయం రెండూ ఉన్నాయి.