రజనీని మించి బన్నీ పారితోషికం ?

స్టార్ హీరోల రెమ్యునరేషన్లకు ఆకాశమే హద్దుగా మారిపోతోంది. ఓ పాతికేళ్ల క్రితం కోటి రూపాయలు తీసుకుంటేనే అదో పెద్ద సెన్సేషన్ లాగా జాతీయ పత్రికలు ప్రచురిస్తే ఇప్పుడా మొత్తాన్ని డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకుంటున్నారు. దీని సంగతలా ఉంచితే పుష్ప 2 ది రూల్ కి గాను అల్లు అర్జున్ పారితోషికాన్ని ఒక ఫిగర్ లాగా కాకుండా వచ్చే రెవిన్యూలో పర్సెంటెజ్ లాగా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ మెగా అల్లు వర్గాల్లో దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. నిజమైతే మాత్రం పెద్ద షాకే అని చెప్పాలి.

దాని ప్రకారం పుష్ప 2కి జరిగే బిజినెస్ లో 33 శాతం ఐకాన్ స్టార్ కి ఇచ్చేలా అగ్రిమెంట్ అయ్యిందట. అంటే ఉదాహరణకు థియేటర్, ఓటిటి, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్, ఆడియో అన్నీ కలుపుకుని ఆ మొత్తం వెయ్యి కోట్లు చేరుకుంటే అందులో మూడు వందల ముప్పై మూడు కోట్లు బన్నీ ఖాతాకు వెళ్లిపోతాయి. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు చేస్తున్న సినిమాకి 210 కోట్లు ఛార్జ్ చేస్తున్నారనే వార్త గత నెలే చక్కర్లు కొట్టింది. ఇప్పుడు పైన చెప్పిన వార్త నిజమైన పక్షంలో చాలా పెద్ద మార్జిన్ తో అంత సులభంగా అందుకోలేని రేంజ్ కి అల్లు అర్జున్ చేరుకుంటాడు.

ఇంతకన్నా ఒక హీరోకి ఘనత, గొప్పదనం ఏముంటుంది. పుష్ప 2 మీద మాములు హైప్ లేదు. అనిమల్, సలార్, గేమ్ ఛేంజర్, కంగువలకు ఏ రేంజ్ లో హైప్ వస్తుందో వాటిని మించి డిమాండ్ ఏర్పడటం ఖాయమని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ట్రేడ్ లోనూ పుష్ప 2 మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. మొదటి భాగం కొన్న గోల్డ్ మైన్స్ దాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఇష్టపడకపోవడంతో మొదలుపెట్టి ఇప్పుడు నార్త్ బయ్యర్లు క్యూ కట్టి మరీ కొనుక్కునేలా సీక్వెల్ రూపొందుతోంది. ఇంకా చాలా టైం ఉండటంతో మైత్రి మేకర్స్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయలేదు.