సంక్రాంతి పండక్కు క్రిస్మస్ ఎందుకయ్యా

అసలు సంక్రాంతి సినిమాల్లో ఏవి ఉంటాయో, ఏవి తప్పుకుంటాయో, అన్నింటికీ థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే కొత్త ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ సేతుపతి – కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ ని జనవరి 12 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందాదున్ లాంటి కల్ట్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఇది రూపొందటంతో మంచి అంచనాలున్నాయి. హిందీ తమిళంతో పాటు ఒకేసారి తెలుగు వెర్షన్ ని సిద్ధం చేయబోతున్నారు.

నిజానికిది డిసెంబర్ 15 రావాలి. కానీ సలార్ వారం గ్యాప్ లోనే వస్తోందని తెలిసి డిసెంబర్ 8కి మార్చుకున్నారు. ఈలోగా ఏమైందో కానీ తిరిగి మళ్ళీ వాయిదా వేసుకున్నారు. అసలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారో గుడ్డిగా అనౌన్స్ చేశారో అంతు చిక్కడం లేదు. విజయ్ సేతుపతికి సౌత్ మార్కెట్ కీలకం. కేవలం తనను చూసేందుకు ఉత్తరాది ఆడియన్స్ థియేటర్లు రారు. అలాంటప్పుడు ఎక్కువ నలిగిపోకుండా సోలోగా ప్లాన్ చేసుకోవాలి. అలా కాదని మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్, శివ కార్తికేయన్ తో పోటీ పడతానంటే అవసరం లేని రిస్క్ అవుతుంది.

ఈ నిర్ణయం పట్ల బయ్యర్ల సంగతేమో కానీ సేతుపతి అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మెర్రీ క్రిస్మస్ టీమ్ ఆలోచన ఇంకో కోణంలో కనిపిస్తోంది. ఎలాగూ రెండు మూడు తప్పుకుంటాయి కాబట్టి ఆ ఛాన్స్ వాడుకునేందుకు ముందే డేట్ ని రిజర్వ్ చేసి పెట్టుకునే ప్లాన్ కావొచ్చు. అసలు స్ట్రెయిట్ సినిమాలకే స్క్రీన్లు సరిపోవని మొత్తుకుంటూ ఉంటే ఇలా డబ్బింగ్ మేళాన్ని తీసుకొచ్చి రుద్దితే మాత్రం తెలుగు నిర్మాతలు గళమెత్తాల్సి ఉంటుంది. ఇలా అనువాదాల మీద జాలి చూపిస్తే మల్టీప్లెక్సులు వాటికి ప్రాధాన్యం ఇచ్చి మన షోలకు ఎసరు పెట్టే ప్రమాదం పొంచి ఉంది.