నేలకు దిగిన ‘రాధేశ్యామ్’ డైరెక్టర్

‘జిల్’ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. రాధాకృష్ణ కుమార్ ప్రామిసింగ్ డైరెక్టర్‌లా కనిపించాడు. ఊర మాస్ సినిమాలు చేసే గోపీచంద్‌ను సూపర్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తూ ‘జిల్’లో యాక్షన్‌ను పండించిన తీరు ఆకట్టుకుంది. ఈ సినిమాలో అతను చూపించిన ప్రతిభే ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రాన్ని తీసే అవకాశం కల్పించింది. ఐతే ఈ అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.

అవసరం లేని భారీ హంగులతో పరిమితికి మించి బడ్జెట్ పెట్టించడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ప్రభాస్‌ ఇమేజ్‌కు ఏమాత్రం తగని సినిమాతో తీవ్ర నిరాశకు గురి చేశాడు రాధాకృష్ణకుమార్. ఆల్రెడీ ‘సాహో’తో దెబ్బ తిన్న యువి అధినేతలు.. ‘రాధేశ్యామ్’ ధాటికి కుదేలయ్యారనే చెప్పాలి. దీన్నుంచి కోలుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది యువి సంస్థ. 

ఐతే ‘రాధేశ్యామ్’తో తమ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ రాధాకృష్ణకు యువి అధినేతలు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ‘రాధేశ్యామ్’ రిలీజయ్యాక ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయి రాధాకృష్ణ.. యువి అధినేతల పిలుపుతో ఓ కొత్త కథ మీద వర్క్ చేశాడట. దాదాపు స్క్రిప్టు పూర్తయినట్లు సమాచారం. ఈసారి భారీ చిత్రంతో చేతులు కాల్చుకోవడం ఎందుకని మిడ్ రేంజ్ మూవీతో వెళ్లబోతున్నారట.

‘జిల్’ స్థాయిలో ఒక మిడ్ రేంజ్ హీరోతో మీడియం బడ్జెట్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. గోపీచంద్, శర్వానంద్ లాంటి హీరోలను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ‘రాధేశ్యామ్’లో పెద్దగా విషయం లేకుండా.. భారీ హంగులు జోడించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూడగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఈసారి నేల మీదికి వచ్చిన రాధాకృష్ణ.. కంటెంట్ మీద దృష్టిపెట్టి మిడ్ రేంజ్ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.