మృణాల్ సినిమా వివాదం – క్షమాపణతో ముగింపు

టాలీవుడ్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ మంచి ఫామ్ లో ఉంది. సీతా రామం బ్లాక్ బస్టర్ పుణ్యమాని ఆఫర్లు బాగానే వస్తున్నాయి. నానితో చేసిన హాయ్ నాన్న డిసెంబర్ 7 విడుదల కాబోతుండగా కేవలం నెల రోజుల గ్యాప్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో మళ్ళీ పలకరించనుంది. ఇటీవలే తను నటించిన బాలీవుడ్ మూవీ పిప్ప థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి స్ట్రీమింగ్ జరుపుకుంది. ట్రెండ్ చూస్తుంటే మంచి రెస్పాన్సే దక్కించుకున్నట్టు కనిపిస్తోంది. అయితే అనుకోకుండా రేగిన వివాదం క్షమాపణ దాకా వెళ్ళింది. అదేంటో చూద్దాం.

పిప్పకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో ప్రముఖ బెంగాలీ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లం రాసిన ఒక దేశభక్తి గీతాన్ని వాడుకున్నారు. దీనికి గాను ఎలాంటి అనుమతులు తీసుకోలేదు, రాయల్టీ చెల్లించలేదు. అసలు సృష్టికర్తలను సంప్రదించనేలేదు. అసలు భాషలోని పదాలను తీసుకుంటే ఇనుప ఊచల జైలుతో పల్లవి మొదలవుతుంది. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో పిప్ప రూపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇస్లం మనవడు ఖాజీ అనిర్బన్ దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో టీమ్ స్పందించింది.

తాము అన్ని అనుమతులు తీసుకునే పాటను సినిమాలో సందర్భానికి తగ్గట్టు నివాళిగా వాడుకున్నామని, ఖాజీ గారి రచనల మీద ఎంతో గౌరవంతో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు వందనం చేసే కోణంలో పెట్టామని ఒక నోట్ విడుదల చేసింది. గీత రచనకు సంబంధించి లైసెన్స్ అగ్రిమెంట్ రాయించుకుని, ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకున్నామని వివరణ ఇచ్చింది. అయితే పిప్పలో వచ్చే సిచువేషన్ పట్ల ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమాపణ కోరుతున్నామని అందులో పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ రే కపూర్ ఫిలింస్ విడుదల చేసిన నోట్ ని ఏఆర్ రెహమాన్ రీట్వీట్ చేయడం విశేషం.