విడుదలకు ముందే ఐదు కోట్ల కారు

సినిమా రిలీజై మంచి విజయం సాధించిన ఆనందంలో నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు కార్లను బహుమతిగా ఇవ్వడం మామూలే. ఇటీవల ‘బేబి’ అనేే చిన్న సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్కేఎన్ ఖరీదైన కారు బహుకరించడం తెలిసిందే. ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిన ఆనందంలో ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ అయితే హీరో, దర్శకుడే కాకుండా సంగీత దర్శకుడికి కూడా లగ్జరీ కార్లు బహుకరించాడు.

ఐతే రిలీజ్ తర్వాత ఇలా లగ్జరీ కార్లు ఇవ్వడం పాత ట్రెండు కాగా.. ఒక సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల కారును బహుమతిగా అందుకోవడం సెన్సేషన్ అనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగ ఈ ఘనతను అందుకున్నట్లు సమాచారం. అతడి కొత్త సినిమా ‘యానిమల్’ వచ్చే నెల ఒకటో తారీఖున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆల్రెడీ సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’తో లాభాల పంట పండించుకున్నాడు నిర్మాత భూషణ్ కుమార్. ‘యానిమల్’ విడుదలకు ముందే దాన్ని మించి ఆయనకు లాభాలు అందించిందట. భారీ హైప్ మధ్య సినిమా రిలీజ్ కాబోతోంది. మంచి టాక్ వస్తే ఓవర్ ఫ్లోస్‌తో మరింతగా భూషణ్‌కు లాభాలు రావడం ఖాయం. సందీప్ వల్లే భారీగా ఆదాయం అందుకున్న భూషణ్.. సినిమా మీద పూర్తి నమ్మకంతో ముందే అతడికి లగ్జరీ కారును బహుమతిగా అందించాడట.

ఆ కారు విలువ రూ.5 కోట్లు కావడం బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఇంత ఖరీదైన కారును బహుశా ఏ దర్శకుడూ గిఫ్ట్ కింది అందుకుని ఉండడు. అది కూడా విడుదలకు ముందే కావడం బాలీవుడ్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం సందీప్ రెడ్డి రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. డిసెంబరు 1న ‘యానిమల్’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.