టైగర్ 3 VS తెలుగోడి మరాఠి సినిమా

పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అందులోనూ వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు పోటీ పడతారు. ఆదివారం విడుదల కాబోతున్న టైగర్ 3 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో చూస్తున్నాం. మరీ పఠాన్, జవాన్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ దూకుడు లేదు కానీ ఇంకా నాలుగు రోజులు ఉండగానే లక్షన్నర టికెట్లు అమ్ముడుపోవడం కండల వీరుడి స్టామినాకి నిదర్శనం. తమిళంలో జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ తప్ప తెలుగులో చెప్పుకోదగ్గ ఏ స్ట్రెయిట్ మూవీ డిసెంబర్ 10, 12 తేదీల్లో విడుదల కాకపోవడం గమనించాల్సిన విషయం.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ టైగర్ 3 తాకిడి ఈ స్థాయిలో ఉందని తెలిసి కూడా ఓ మరాఠి మూవీ సవాల్ విసరడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. దాని పేరు నాళ్ భాగ్ 2. 2018లో వచ్చిన నాళ్ అనే బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు. దీన్ని తీసింది ఎవరో కాదు. మన తెలుగాయనే. గుంటూరుకి చెందిన సుధాకర్ రెడ్డి ఎక్కంటి అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ నిత్యం టాలీవుడ్ వ్యవహారాల్లో మునిగి తేలేవాళ్లకు సుపరిచితమే. మధుమాసం, మనసారా, పౌరుడు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, దళం, జార్జ్ రెడ్డిలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. నాళ్ డైరెక్టర్ ఈయన డెబ్యూ చిత్రం. జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

నాళ్ విమర్శకుల ప్రశంసలు పొంది కమర్షియల్ గానూ భారీ విజయం నమోదు చేసుకుని కల్ట్ గా నిలిచిపోయింది. ఇప్పుడీ సీక్వెల్ కూడా ఈయనే తీశారు. జీ స్టూడియోస్ నిర్మించింది. క్రేజ్ ఉన్న బ్రాండ్ కావడంతో మహారాష్ట్రలోని డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలబడి కావాల్సిన మల్టీప్లెక్సు షోలు సర్దుబాటు చేస్తున్నారు. సింగల్ స్క్రీన్లలో సైతం ఆడుతుందని నిర్మాతలు ధీమాగా ఉండటంతో టైగర్ 3కి అవి ఆల్రెడీ బుక్ అయినా సరే జీ సంస్థ తన వంతుగా కాసిన్ని ఇప్పించుకునేందుకు పావులు కదుపుతోంది. నాళ్ 2కి అంత క్రేజ్ ఉంది మరి. ఏమైనా ఒక తెలుగోడు ఇలా బాలీవుడ్ మూవీకి సవాల్ విసరడం విశేషమే.