‘ఆ కథను బాలయ్యతో 100 కోట్లు పెట్టి తీయాల్సింది’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ కథ తనదే అని.. తన కథను కాపీ కొట్టి అన్యాయం చేశారని రాజేష్ మండూరి అనే రచయిత ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముందు ఈ విషయాన్ని ఇండస్ట్రీ జనాలు తేలిగ్గా తీసుకున్నారు కానీ.. రాజేష్ టీవీ ఛానెళ్లన్నింటికీ తిరిగి పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఓ టీవీ సుదీర్ఘ ఇంటర్వ్యూలో అతను.. తన వెర్షన్‌ ఏంటో వివరంగా చెప్పుకొచ్చాడు.

తాను 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. తనది ప్రకాశం జిల్లా అని చెప్పిన రాజేష్.. తమ జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అలియాస్ బుజ్జి తనకు క్లోజ్ అని.. దర్శకుడు కావాలన్న ఉద్దేశంతో తాను తయారు చేసుకున్న ‘పెద్దాయన’ అనే కథను ఓ సందర్భంలో ఆయనకు చెప్పానని.. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు తనకు బాగా తెలుసని చెప్పి.. వాళ్లకు స్టోరీ చెప్పే అవకాశం కల్పించారని.. దీంతో ఆ సంస్థకు చెందిన యలమంచిలి రవి, చెర్రీలకు తాను కథ చెప్పడానికి వెళ్లానని రాజేష్ తెలిపాడు. రవి ఓ 20 నిమిషాలు కథ విని వెళ్లిపోయారని.. చెర్రీ ఫస్టాఫ్ వరకు విని కొన్ని పనుల వల్ల బ్రేక్ తీసుకున్నారని.. తర్వాత మిగతా కథ విన్నారని.. వాళ్లకు బాగా నచ్చిందని.. ఐతే చాలా స్పాన్ ఉన్న, పెద్ద హీరోతో చేయాల్సిన కథ కావడంతో ఓ కొత్త దర్శకుడిని నమ్మి పెట్టుబడి పెట్టలేమని.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని.. కథ ఇచ్చేయమని అడిగారని.. ఐతే తాను టైం కావాలని అడిగానని రాజేష్ తెలిపాడు.

ఐతే కొన్ని నెలల తర్వాత శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మొదలైందని.. దీని కథ తన కథతో పోలి ఉందని వేరే వాళ్లు చెబితే తెలిసిందని.. ఆ సినిమా కో డైరెక్టర్‌ను అడిగితే నిజమే అన్నారని.. దీంతో తాను తమ ఎమ్మెల్యేను ఇదేంటని అడిగితే ఆయన సమాధానం ఇవ్వలేదని.. తనతో మాట్లాడ్డమే మానేశాడని.. పరుచూరి గోపాలకృష్ణగారికి చెబితే రచయితల సంఘంలో ఫిర్యాదు చేయమన్నారని.. అదే పని చేశానని.. కానీ కొరటాల తన కథేంటో తెలియకుండా ఎవరో చెప్పిందాన్ని పట్టుకుని ఇలా ఎలా అడుగుతారని ప్రశ్నించడంతో వాళ్లు ఏమీ చేయలేకపోయారని.. కొరటాలను కలిసే ప్రయత్నం చేస్తే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని.. మైత్రీ వాళ్లు కథ అడిగాక తాను తన గురువు బి.గోపాల్‌ను కలిశానని.. ఆయనకు ఈ కథ నచ్చి నువ్వు చెయ్యకపోతే నాకిచ్చేయ్, నేను బాలయ్య బాబుతో చేసుకుంటా అని అడిగారని.. తన గురువు అడగడంతో, రచయితగా కూడా తనకు పేరొస్తుందన్న ఉద్దేశంతో ఓకే అన్నానని.. తన కథతో బాలయ్య హీరోగా వంద కోట్ల బడ్జెట్లో ఆ సినిమా చేయాల్సిందని.. కానీ ఇంతలో తన కథతోనే ‘ఆచార్య’ మొదలుపెట్టేశారని ఆరోపించాడు రాజేష్.