సెంథిల్‌ను రాజమౌళి వదలడు కానీ.. 

రాజమౌళి సినిమా మొదలవుతోందంటే.. కొందరు టెక్నీషియన్లు ఫిక్స్ అన్నట్లే ఉంటుంది. రాజమౌళి సంగీతం అందిస్తే.. రమ రాజమౌళి కాస్ట్యూమ్స్ వ్యవహారం చూసుకుంటుంది. శ్రీనివాస్ మోహన్ వీఎఫెక్స్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఛాయాగ్రహణం ఆటోమేటిగ్గా సెంథిల్ కుమార్ చేతుల్లోకి వెళ్తుంది. ‘సై’ రోజుల నుంచి ఈ తమిళ టెక్నీషియన్‌తో రాజమౌళి అనుబంధం కొనసాగుతోంది. మన దర్శక ధీరుడి విజన్‌ను సరిగా అర్థం చేసుకుని.. ఆయన కోరుకున్న స్థాయిలో కెమెరాతో మాయాజాలం చేయగల, అద్భుత ప్రపంచాలను సృష్టించగల నైపుణ్యం సెంథిల్‌కే సొంతం.

మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో రాజమౌళి లాగే సెంథిల్ సైతం ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం తన పనితనాన్ని మెచ్చుకున్నారు. రాజమౌళితో అంత మంచి సింక్ ఉన్న సెంథిల్.. మహేష్ బాబుతో జక్కన్న తీయబోయే కొత్త చిత్రానికి పని చేయట్లేదనే వార్త నిన్నట్నుంచి సంచలనం రేపుతోంది. ఏ రకంగా చూసినా రాజమౌళిని సెంథిల్.. సెంథిల్‌ను రాజమౌళి వదిలే పరిస్థితే కనిపించదు.

సెంథిల్ కాకుండా మరో సినిమాటోగ్రాఫర్ రాజమౌళి విజన్‌ను అర్థం చేసుకోగలడా అన్నది డౌట్. అదే సమయంలో రాజమౌళి సినిమాతో సెంథిల్‌కు వచ్చే పేరు ఇంకెక్కడా రాకపోవచ్చు. అయినా మహేష్ సినిమాకు సెంథిల్ ఎలా దూరమవుతున్నాడో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ ఎడబాటు వెనుక కారణం వేరు అని సమాచారం. ఇద్దరి మధ్య విభేదాల్లాంటివేమీ లేవట. సెంథిల్ ఎప్పట్నుంచో దర్శకుడు కావాలని అనుకుంటున్నాడు. స్క్రిప్టు కూడా రెడీ చేసుకుని నిర్మాతలను కూడా సెట్ చేసుకున్నాడు.

కానీ రాజమౌళి సినిమాలతో ఏళ్లకు ఏళ్లు ట్రావెల్ చేస్తుండటం వల్ల తన కలను నెరవేర్చుకోలేకపోతున్నాడు. తన డ్రీమ్ అలా అలా వాయిదా పడుతూ వెళ్లిపోతోంది. రాజమౌళితో సినిమా అంటే ఒక్కోదానికి మూణ్నాలుగేళ్లు ట్రావెల్ చేయాలి. ప్రి ప్రొడక్షన్ దశ నుంచి పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. మహేష్ సినిమా చేయాలని ఉన్నా.. దానికి కమిట్మెంట్ ఇస్తే తన కలను ఇంకో మూణ్నాలుగేళ్లు వాయిదా వేసుకోవాల్సిందే అని భావించి సెంథిల్ ఈ చిత్రం వరకు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాడట. త్వరలోనే సెంథిల్ దర్శకత్వంలో సినిమాను కూడా అనౌన్స్ చేస్తారని.. దానికి రాజమౌళి నుంచి కూడా సహకారం ఉంటుందని సమాచారం.