తమిళ దర్శకుడితో వెంకీ రిస్క్ చేస్తారా

సీనియర్ హీరోలు దర్శకులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న పొరపాటు చేసినా దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి రావడంతో పాటు వయసులో ఉన్న స్పీడ్ ఇప్పుడు కష్టం కాబట్టి దానికి తగ్గట్టు సెలక్షన్ బెస్ట్ గా ఉండాలి. ఈ విషయంలో బాలకృష్ణ అందరికంటే ముందున్నారు. రూలర్ తర్వాత మూస డైరెక్టర్లకు స్వస్తి చెప్పి కొత్త జనరేషన్ కే ఓటేస్తున్నారు. వెంకటేష్ కూడా పరుగులు పెట్టకుండా స్క్రిప్ట్ పక్కాగా నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి, శైలేష్ కొలను లాంటి అతి కొందరే ఆయన్ను మెప్పించారు. అనుదీప్, తరుణ్ భాస్కర్ వల్ల కాలేదు.

నిన్న జరిగిన జిగర్ తండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన వెంకటేష్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ని ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తడమే కాక తనకోసం స్టోరీ రెడీ చేస్తున్న సంకేతం ఇచ్చారు. అంటే మనసులో చేయాలనే కోరిక బలంగా ఉందని అర్థమైపోతుంది. కానీ సుబ్బరాజ్ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. జిగర్ తండా, పిజ్జా, మెర్క్యూరీ, ఇరైవి, జగమే తంతిరం, మహాన్ ఇవన్నీ మన ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా వచ్చినవి కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పేట చేస్తే తమిళం మినహాయించి ఇతర భాషల్లో యావరేజ్ అయ్యింది. టెక్నికల్ గా ఇతనిది మంచి చేయే.

కానీ టాలీవుడ్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా వెంకటేష్ కోసం ఏదైనా సబ్జెక్టు రావడం సవాలే. పైగా ఇతను హీరోలతో సహా ఎవరి మాటా వినడనే పేరు ఇండస్ట్రీలో ఉంది. ఈ విషయాన్ని లారెన్స్, ఎస్జె సూర్యలు నవ్వుతు అయినా సరే చాలా స్పష్టంగా చెప్పారు. మరి కమర్షియల్ లేదా ఎంటర్ టైన్మెంట్ ఈ రెండింటికే ప్రాధాన్యం ఇచ్చే వెంకీ అభిమానులను సంతృప్తి పరచాలంటే విభిన్నంగా ఆలోచించాలి. మరి వెంకటేష్ యథాలాపంగా అన్నారా లేక సీరియస్ గా అన్నారా వేచి చూడాలి. ఒకవేళ జిగర్ తండా డబుల్ ఎక్స్ కనక ఇక్కడ హిట్ అయితే అప్పుడీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందేమో.