ఇళయరాజా మీద ధనుష్ ప్రేమ

ఇసైజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఇళయరాజా పాటలు ఏదో ఒక సందర్భంలో వినకుండా ఉండలేని వాళ్ళు కొత్త తరంలో అయినా సరే దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరూ లేరంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. దేవిశ్రీ ప్రసాద్ లాంటి చిచ్చర పిడుగులు ఆయన భక్తులే. ఇటీవలే హైదరాబాద్ లో ఒక లైవ్ ఈవెంట్ చేస్తే ఫ్యాన్స్ వెల్లువలా తరలివచ్చారు. దానికి ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం మినహాయింపుగా నిలవలేదు. వెయ్యికి పైగా సినిమాలతో అప్రతిహతంగా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్న రాజా నిజ జీవిత కథ గురించి చాలా మందికి అవగాహన లేదు.

అందుకే ఆ ప్రయత్నానికి పూనుకున్నాడు హీరో ధనుష్. ఇతనికి రాజా అంటే వల్లమాలిన ప్రేమ. గురువుగా భావిస్తాడు. ఆయన కూడా అంతే. విడుదల పార్ట్ 1 తమిళ వెర్షన్ లో కోరిమరీ ఒక పాట పాడించుకున్నాడు. ఇళయరాజా లైఫ్ లో చాలా సంఘర్షణ ఉంది. మదరాసు వచ్చిన కొత్తలో హార్మోనియం పెట్టె పట్టుకుని బ్రిడ్జ్ ల మీద పాటలు పాడటంతో మొదలుపెట్టి భారతీరాజా స్నేహం, స్టేజి ప్రదర్శనలు ఇవ్వడం, తొలి అవకాశం దక్కించుకోవడం ఇలా ఎన్నో ఘట్టాలున్నాయి. కావాల్సినంత డ్రామా కూడా ఉంది. అందుకే ఆ మహానుభావుడి గాథని తెరమీద చూపించబోతున్నారు.

మోహన్ లాల్ తో వృషభ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్న కనెక్ట్ మీడియా ఈ ప్రాజెక్టుని టేకప్ చేసిందట. రాజా పాత్రలో ధనుష్ నటిస్తాడు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రెండు మూడు పేర్లు పరిశీలిస్తున్నారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ కార్యరూపం దాలిస్తే మాత్రం ఇళయరాజా ప్రస్థానాన్ని తెరమీద చూస్తూ, ఆయన స్వరపరిచిన గొప్ప పాటల వెనుక ఉన్న సంఘర్షణను తెలుసుకుంటూ, పాటల సాగరంలో మునిగిపోతూ మ్యూజిక్ లవర్స్ పరవశం చెందటం ఖాయం. డైరెక్టర్ ని లాక్ చేసుకున్నాక ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయబోతున్నారు.