టైసన్ నాయుడు …ఏం జరుగుతోంది

బాలీవుడ్ మీద మోజుతో ఎందరు వద్దంటున్నా వినకుండా ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన మూడు సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు వరసగా తెలుగు సినిమాలు చేసే పనిలో పడ్డాడు. భీమ్లా నాయక్ తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టి ఓ రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. టైసన్ నాయుడు టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపు ఖరారు కావొచ్చు. అయితే ఇది ఆగిపోయిందని, ఏవో అభిప్రాయ భేదాలతో పాటు ఇతరత్రా కారణాల వల్ల క్యాన్సిల్ చేశారనే ప్రచారం మొన్నటిదాకా తిరిగింది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇది పూర్తిగా ఆగిపోలేదని, కేవలం బ్రేక్ ఇచ్చారని, త్వరలోనే వేగంగా చేసేలా ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారట. అయితే ఈలోగా సాయిశ్రీనివాస్ నాంది – ఉగ్రం ఫేమ్ విజయ్ కనక మేడల చెప్పిన ఒక కథకు పాజిటివ్ గా స్పందించాడన్న టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది. అల్లరి నరేష్ తో రెండో ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో విజయ్ ఈసారి కమర్షియల్ జానర్ కి షిఫ్ట్ అయ్యారట. అందులో భాగంగానే బెల్లంకొండ హీరోతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు రాక్షసుడు 2 కూడా ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఏది ఏమైనా టైసన్ నాయుడు టైటిల్ ఇదే అయినా కాకపోయినా వీలైనంత త్వరగా ఏదో ఒక అప్డేట్ ఇస్తే బెటర్. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో ఒక సక్సెస్ ఫుల్ మూవీ చేశాక సాగర్ కె చంద్ర ఒప్పుకున్న సినిమా ఇదే. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ నుంచి వినిపిస్తోంది కానీ ఫస్ట్ లుక్కో టీజరో ఏదో ఒకటి వదిలితే ఒక అంచనాకు రావొచ్చు. అల్లుడు అదుర్స్ తర్వాత సాయి శ్రీనివాస్ మళ్ళీ తెరపై కనిపించలేదు. ఒకవేళ హిందీ ఛత్రపతి కనక పెద్ద హిట్ అయ్యుంటే ఎలా ఆలోచించేవాడో కానీ తనకు మంచి మార్కెట్ ఇచ్చిన టాలీవుడ్ కన్నా ఇంకేదీ ప్రాధాన్యం కాదని త్వరగానే తెలుసుకున్నాడు.