కేసరి పట్ల డెవిల్ మౌనం ఎందుకో

బాక్సాఫీస్ వద్ద దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచిన భగవంత్ కేసరి ఈ జోరు కనీసం ఇంకో వారం కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే 55 శాతం దాకా రికవరీ జరిగిపోయిన నేపథ్యంలో మిగిలింది నవంబర్ తొలినాటికి పూర్తయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. కంటెంట్ పరంగా అనిల్ రావిపూడి ఎప్పుడూ చూడని కథని చెప్పలేదు కానీ తండ్రి కాని తండ్రి సెంటిమెంట్ తో బాలయ్య, శ్రీలీల మధ్య చూపించిన ఎమోషన్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ ఆడపిల్లలకు ఇచ్చిన సందేశం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. లియో, టైగర్ నాగేశ్వరరావు కన్నా బెటర్ ఆప్షన్ గా నిలుస్తోంది.

ఇదిలా ఉండగా ఇంత విజయం సాధించిన భగవంత్ కేసరి ఫలితం పట్ల కళ్యాణ్ రామ్ మౌనంగా ఉండటం పట్ల నందమూరి అభిమానుల్లో పలురకాల చర్చలు జరుగుతున్నాయి. మాములుగా బాబాయ్ ఏదైనా పెద్ద హిట్టు కొట్టినప్పుడు తను స్పందించడం చాలా సార్లు జరిగింది. అఖండ, వీరసింహారెడ్డిలకు కూడా ట్వీట్లు పెట్టాడు. మరి కళ్ళముందు కనిపిస్తున్న భగవంత్ కేసరి గురించి ఒక్క మాట చెప్పకపోవడం ఎందుకోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ పండగ సందర్భంగా డెవిల్ పోస్టర్ షేర్ చేసుకున్న కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో తన సినిమా వరకు యాక్టివ్ గానే ఉన్నాడు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సైలెంట్ గా ఉండటం పట్ల తన మీద తమ్ముడి మీద వచ్చిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని రెస్పాన్స్ ఇవ్వడం లేదా ఇంకొన్ని రోజులు ఆగుదామనుకున్నాడా తెలియాల్సి ఉంది. వచ్చే నెల డెవిల్ రిలీజ్ కాబోతోంది. దర్శకుడి  మార్పు విషయంలో ఆల్రెడీ రచ్చ జరిగింది. దాని గురించి కూడా కళ్యాణ్ రామ్ మౌనంగానే ఉన్నాడు. త్వరలోనే డెవిల్ పబ్లిసిటీ మొదలు పెట్టాలి. మీడియా ముందుకు రావాలి. రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. కేవలం సినిమాకు మాత్రమే కట్టుబడి ఎవరూ అడగరు కాబట్టి ముందస్తు ప్రిపరేషన్ అవసరం అయ్యేలా ఉంది.