రేణు దేశాయ్ రీఎంట్రీ ఫలితం దక్కిందా

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలతో జీవితం గడిపేస్తున్న రేణు దేశాయ్ ఇరవై సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చారు. స్టువర్ట్ పురంని అభివృద్ధి చేసి అక్కడి దొంగల్లో మార్పు రావాలని తపించే సామజిక కార్యకర్త హేమలత లవణంగా ప్రాధాన్యత కలిగిన పాత్రే దక్కినప్పటికీ తెరమీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆవిడ రీ ఎంట్రీ మంచి జ్ఞాపకాన్ని ఇవ్వడం కష్టమే. ఇవాళ థియేటర్లలో ఆమె ఎంట్రీకి సైతం జనంలో కేకలు, విజిల్స్ వినిపించడం ఆశ్చర్యం. అవి ఎవరి నుంచి వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రేణు దేశాయ్ చిన్ని తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరించడమే కాక అవకాశం వీలు ఉన్నప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. టైగర్ నాగేశ్వరరావులో తెల్లచీర, డీ గ్లామర్ లుక్ తో మొహంలో కళ లేని ఒక నిస్సత్తువ లుక్ ఇవ్వడం వల్ల ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఫ్యాన్స్ రమ్యకృష్ణ, మధుబాల, విజయశాంతి, ఇంద్రజ, నదియా తరహాలో పెద్దరికం, హుందాతనంతో పాటు తెరమీద చక్కగా ఆవిష్కరించే పాత్రల్లో చూడాలని కోరుకున్నారు. టైగర్ కథ విని ఇన్స్ ఫైర్ అయ్యానని రేణు దేశాయ్ గొప్పగా చెప్పారు.

ఫలితం గురించి కాసేపు పక్కనపెడితే ఇకపై యాక్టింగ్ కొనసాగిస్తారో లేదో చూడాలి. 2003 జానీ తర్వాత మళ్ళీ ఆవిడ మేకప్ వేసుకోలేదు. పూర్తిగా ఫ్యామిలీ కోసం టాలీవుడ్ కు దూరంగా ఉన్నారు. నిర్మాత, దర్శకురాలిగా మరాఠిలో ఇష్క్ వాలా లవ్ తీశారు తప్పించి అంతకు మించి యాక్టివిటీ లేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్టులకు తెలుగులో డిమాండ్ ఉంది. నటన కొనసాగించేది లేనిది స్పష్టంగా చెప్పకపోయినా తరచు కనిపించడం పట్ల ఆసక్తిగా ఉన్నారని ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతం డివైడ్ టాక్ తో బోణీ మొదలుపెట్టింది.