తారక్ ఫ్యాన్స్ ‘కేసరి’ని దూరం పెట్టారా?

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘భగవంత్ కేసరి’ ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రెండీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య జట్టు కట్టడమే క్రేజీగా అనిపించింది. ఇక అనిల్‌ ఏమో తన శైలికి కొంచెం భిన్నంగా, కంటెంట్ ప్రధానంగా సినిమా తీస్తున్నట్లు, బాలయ్యను నెవర్ బిఫోర్ స్టయిల్లో చూపించబోతున్నట్లు ముందు నుంచి సంకేతాలు ఇస్తున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి.

ఇలా అన్నీ పాజిటివ్‌గా అనిపించిన సినిమాకు.. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరగాలి. కానీ మూడు రోజుల ముందు బుకింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ట్రెండ్ గమనిస్తే.. బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డిల కన్నా డల్లుగా నడిచాయి బుకింగ్స్. రిలీజ్‌కు ముందు రోజు కూడా చాలా షోలు ఖాళీగా ఉన్నాయి. సోల్డ్ ఔట్ షోలు చాలా తక్కువ. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న షోలు కూడా ఆశించిన స్థాయిలో లేవు.

బాలయ్య సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులూ మరీ ఎగబడి ఏమీ ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకోరు. ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. బి, సి సెంటర్లలో నేరుగా థియేటర్లకు వెళ్లి టికెట్లు తీసుకుంటారన్న మాట వాస్తవమే. అయినా సరే.. బుకింగ్స్‌ డల్లుగా ఉన్నట్లే. ఇందుక్కారణం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ‘భగవంత్ కేసరి’కి దూరం జరగడమే అనే చర్చ నడుస్తోంది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడూ ఉండే యూనిటీ ఇప్పుడు కనిపిించట్లేదని అంటున్నారు.

బాలయ్యకు, తారక్‌కు మధ్య విభేదాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ.. వీళ్లలో ఎవరి సినిమా రిలీజైనా రెండు వర్గాలూ ఒక్కటై సినిమాను భుజానికి ఎత్తుకుంటాయి. కానీ ఇటీవలి రాజకీయ పరిణామాలు, తారక్ గురించి అడిగితే ‘డోంట్ కేర్’ అన్న బాలయ్య డైలాగ్.. జూనియర్ అభిమానులకు కోపం తెప్పించాయని.. దీంతో వాళ్లు పట్టుబట్టి ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌తో నిరాశలో ఉన్న టీడీపీ క్యాడర్ కూడా బాలయ్య సినిమా పట్ల ఎప్పట్లా చూపించే ఉత్సాహం చూపించట్లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పరిస్థితి మారుతుందని భావిస్తున్నారు.