తమన్, దేవి తప్ప ఎవరూ కనిపించరా?

తెలుగులో ఏ పెద్ద సినిమా మొదలువుతున్నా.. సంగీత దర్శకుడిగా పరిగణించే పేర్లు తమన్, దేవిశ్రీ ప్రసాద్‌లవే. ఒకప్పుడు దేవి నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. తమన్ రెండో స్థానంలో ఉండేవాడు. కానీ గత కొన్నేళ్లుగా తమన్ స్టార్ హీరోలు, డైరెక్టర్లకు ఫస్ట్ ప్రయారిటీగా మారాడు. దేవి ప్రాధాన్యం కొంచెం తగ్గింది. అలా అని అతడికి డిమాండ్ లేదా అంటే అలాంటిదేమీ లేదు. కానీ దర్శక నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ వీరి చుట్టూనే తిరగడం ఆశ్చర్యం కలిగించే విషయం.

తమిళంలో, హిందీలో సంగీత దర్శకుల విషయంలో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. తమిళంలో సంగతే తీసుకుంటే అక్కడ అనిరుధ్ రవిచందర్‌దే డామినేషన్ అయినప్పటికీ.. ఎ.ఆర్.రెహమాన్, యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, జి.వి.ప్రకాష్ కుమార్, డి.ఇమాన్.. ఇలా చాలామంది సంగీత దర్శకులు  పెద్ద సినిమాలను వాళ్లు పంచుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర అలాంటి వెరైటీ కనిపించదు. రాజమౌళి సినిమాలకు కీరవాణి ఫిక్స్. మిగతా పెద్ద సినిమాలకు తమన్, దేవిశ్రీల మధ్యే పోటీ ఉంటుంది.

ఎంత పారితోషకమైనా ఇచ్చి అనిరుధ్‌ను తెచ్చుకుందామని చూస్తారే తప్ప.. వేరే సంగీత దర్శకుల వైపు చూడట్లేదు. మధ్యలో అనూప్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం రైజ్ అయినట్లు కనిపించారు కానీ.. వాళ్లు మాస్ సినిమాలకు సరిపోయే మ్యూజిక్ ఇవ్వలేరని ఒక ముద్ర వేసి పక్కన పెట్టేశారు.  ఐతే ఇప్పుడు భీమ్స్ సిసిరోలియో కొంచెం ఆశాజనకంగా కనిపిస్తున్నాడు. అతను ధమాకా, బలగం, మ్యాడ్ లాంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ మూడు సినిమాల విజయాల్లో సంగీతం కీలక పాత్ర పోషించింది.

భీమ్స్ అన్ని రకాల పాటలూ ఇవ్వగలడు అనడానికి ఈ మూడు సినిమాలు రుజువు. వీటిలో ఒకదాంతో ఒకదానికి పోలిక ఉండదు. ‘ధమాకా’లో మాస్ పాటలతో అలరించాడు. ‘బలగం’లో జానపదాలతో మనసు దోచాడు. ‘మ్యాడ్’లో యూత్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలో అతను ‘గాంజా శంకర్’ అనే మాస్ సినిమాతో రాబోతున్నాడు. మన దర్శక నిర్మాతలు ఎప్పుడూ తమన్, దేవి అనకుండా.. రేంజ్ చూడకుండా ఇలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇస్తే.. వాళ్ల సత్తా ఏంటో చూపిస్తారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.