థియేటర్లు వెలవెలా బయ్యర్లు విలవిలా

పండగ దగ్గర్లో థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా సినిమాలు రావడానికి ఇంకో అయిదు రోజులు ఉండటంతో గంటనో యుగంగా గడుపుతున్నారు. కారణం అత్యధిక శాతం వాటిలో కనీసం అద్దెలు, కరెంట్ బిల్లులు వసూలయ్యేంత కలెక్షన్లు లేకపోవడమే. నిన్న రిలీజైన వాటిలో ఏ ఒక్కదాని మీద జనానికి ఆసక్తి లేదని వసూళ్లు స్పష్టం చేశాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడేట్టు ఇవాళ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ దెబ్బకు అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో బయటికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఉద్యోగం, వ్యాపారరిత్యా అవసరాలు ఉన్న బాపతు తప్ప అందరూ క్రికెట్లోనే.

అన్ని వైపులా ఇలా దెబ్బలు తగలడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు మాములుగా లేవు. ఎంత చిన్న హాలైనా సరే షోకి కనీసం పది వేల కలెక్షన్ గ్రాస్ రూపంలో రానిదే కష్టమని, చేతి నుంచి వేసుకుని రోజూ చిల్లర లెక్కబెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. నిన్న చాలా నయం. నేషనల్ సినిమా డే పేరుతో మల్టీప్లెక్సులు తెలంగాణలో 112 రూపాయలకు టికెట్లు అమ్మడం చాలా మేలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోయారు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే మ్యాడ్, జవాన్, స్కందలతో నెట్టుకు రావాల్సి వస్తోంది.

గురువారం దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. భగవంత్ కేసరి, లియోలు 19నే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఊరిలో తొంభై శాతం పైగా స్క్రీన్లు వీటినే వేసుకుంటాయి. మరుసటి రోజు టైగర్ నాగేశ్వరరావు వచ్చి తనకు కేటాయించిన వాటా తీసుకుంటాడు. వీటిలో రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చినా చాలు అక్టోబర్ చివరి దాకా థియేటర్ల ఫీడింగ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పై పెచ్చు 25 వరకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉంటాయి కనక కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆపై నవంబర్ నుంచి చెప్పుకోదగ్గ సినిమాలే క్యూలో ఉండటంతో ఆపై డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకోవచ్చు.