థియేటర్ల కోసం మళ్లీ గొడవ

సంక్రాంతి, దసరా లాంటి క్రేజీ సీజన్లు వచ్చాయంటే బాక్సాఫీస్ దగ్గర పోటీ మామూలుగా ఉండదు. సంక్రాంతికి ఉన్న డిమాండ్ ఇంకే సీజన్‌కూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎక్కువమంది ఆ సీజన్ మీద కర్చీఫ్ వేయాలని చూస్తారు. ఒకే వీకెండ్లో మూణ్నాలుగు సినిమాలు, అవి కూడా ఒక రేంజ్ ఉన్నవి రిలీజవుతుంటాయి. దీంతో థియేటర్ల కోసం పోటాపోటీ తప్పదు. ఈ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగిపోతుంటాయి.

ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్లకు తగ్గించి.. అనువాద చిత్రమైన ‘వారసుడు’కు థియేటర్లకు కేటాయించడం మీద ఎంత రభస జరిగిందో తెలిసిందే. చివరికి దిల్ రాజు వెనక్కి తగ్గి ‘వారసుడు’ను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాడు. కానీ అప్పుడు కూడా ‘వారసుడు’ కోసం చాలా థియేటర్లు అట్టిపెట్టుకున్నారనే విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు దసరా సీజన్ వస్తోంది. సంక్రాంతి తర్వాత పండుగల్లో ఎక్కువ క్రేజ్ ఉన్నది దసరాకే. ఈ పండక్కి మూడు క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి.

అందులో రెండు తెలుగువి. ఒకటి తమిళ అనువాదం. బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో పాటు రవితేజ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’కు కూడా మంచి క్రేజ్ ఉంది. అలాగే అనువాద చిత్రమైన ‘లియో’కు కూడా కొంచెం డిమాండ్ ఉంది. ఐతే ‘లియో’ను రిలీజ్ చేస్తున్న సితార తెలుగులో పెద్ద సంస్థ. థియేటర్ల డీలింగ్ విషయంలో దాని అధినేత నాగవంశీది అందెవేసిన చెయ్యి. ‘భగవంత్ కేసరి’ నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ‘టైగర్..’ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌లతో పోలిస్తే నాగవంశీకి థియేటర్ల మీద ఎక్కువ పట్టుంది.

ఐతే రెండు తెలుగు చిత్రాలకూ ఉన్న డిమాండ్ వేరు. వాటికే ఎక్కువ థియేటర్లు దక్కించుకునే ప్రయత్నాలు నిర్మాతలు గట్టిగా చేస్తున్నారు. అదే సమయంలో ‘లియో’ కోసం ఎక్కువ థియేటర్లను రాబట్టుకోవడానికి నాగవంశీ ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈ విషయంలో అంతర్గతంగా మంచి పోటీ నడుస్తోంది. కొంచెం గొడవలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ టైంకి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారొచ్చనే చర్చ కూడా నడుస్తోంది.