సినిమాపై ఆశల్లేకే అలా వదిలేశారా?

మామా మశ్చీంద్ర.. గత వీకెండ్లో రిలీజైన కొత్త సినిమా. రైటర్ కమ్ యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కొంత అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితం అందుకుంది. తొలి రోజు నుంచే ఈ సినిమా థియేటర్లలో జనం లేరు.

ఐతే రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ విడుదలై మూడో రోజుకే ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో థియేటర్లను కలిగి ఉన్న సునీల్ నారంగ్ ఈ చిత్రానికి నిర్మాత. అలాంటి వ్యక్తి సినిమాను విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి తీసుకురావడం.. థియేటర్లలో రిలీజైన మూడో రోజుకే అనౌన్స్‌మెంట్ రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా మీద నిర్మాతలు ముందే ఆశలు కోల్పోయిన సంకేతాలు కనిపించాడు విడుదలకు ముందు. రిలీజ్ ముంగిట జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఈ సినిమా విడుదలవుతున్నట్లే జనాలకు తెలియట్లేదని ఓ విలేకరి అంటే హీరో సుధీర్ బాబు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. తర్వాత ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ మాట్లాడుతూ.. సినిమాకు నిర్మాతలు సరిగా పబ్లిసిటీ చేయలేదన్నట్లుగా మాట్లాడాడు. ఈ విషయంలో అతడి అసంతృప్తి స్పష్టంగా తెలిసిపోయింది.

సినిమా ఆడకపోతే అది వేరే విషయం కానీ, ఒక సినిమా వస్తున్నట్లు జనాలకే తెలియని పరిస్థితి ఉందంటే దర్శకుడిగా తనకది ఎక్కువ బాధ కలిగించే విషయమని హర్ష అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ‘మామా మశ్చీంద్ర’ ఫలితం గురించి నిర్మాతలకు ముందే ఒక అవగాహన వచ్చేసిందని, కాబట్టే థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపదని అర్థమయ్యే పబ్లిసిటీ కూడా చేయలేదని అర్థమవుతోంది. అందుకే విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో వచ్చేలా డీల్ చేసుకుని.. రిలీజైన మూడో రోజుకే ప్రకటన కూడా ఇచ్చేశారని తెలుస్తోంది.