మిషన్ ఫెయిలయ్యింది హీరో పాసయ్యాడు

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకోవడంలో అక్షయ్ కుమార్ శైలి వేరే. ముఖ్యంగా రియల్ ఇన్సి డెంట్లను, బయోపిక్కలను చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈయన కొత్త సినిమా మిషన్ రాణి గంజ్ మొన్న శుక్రవారం విడుదలయ్యింది. జవాన్ తర్వాత ఇంకో పెద్ద హీరో సినిమా రాలేదు కాబట్టి ట్రేడ్ దీని మీద భారీ నమ్మకం పెట్టుకుంది. అయితే వాళ్ళ ఆశలను నీరుగారుస్తూ మిషన్ రాణిగంజ్ ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. ఆదివారం కొంత మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ మొదటి వీకెండ్ లో పట్టుమని పది కోట్లు రాకపోతే అది ఖచ్చితంగా  ఫ్లాపే.

మిషన్ రాణిగంజ్ 1989లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందనుంది. వెస్ట్ బెంగాల్ లో ఉన్న మహాబిర్ కాలరీలో చిక్కుకున్న 65 మంది మైనింగ్ కార్మికులను ప్రాణాలకు తెగించి కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ సాహసం ఆధారంగా  దర్శకుడు టిను సురేష్ దేశాయ్ ఈ సర్వై వర్ థ్రిల్లర్ రూపొందించారు. అయితే హీరో అక్షయ్ కుమార్ కాబట్టి  క్యారెక్టరైజేషన్ పరంగా అవసరానికి మించిన ఫోకస్ పెట్టడంతో ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కర్లేని ప్రహసనంతో నిండిపోయింది. జస్వంత్ ఎలాంటి వాడు అనేది చూపించడానికి పడిన తాపత్రయం ఓవరాల్ ఫీల్ ని చాలా తగ్గించేసింది.

చివరి ముప్పావుగంట అసలు మిషన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రం బాగా డీల్ చేశారు . అప్పటికే నీరుగారిన ఆసక్తిని అవి పూర్తిగా నిలబెట్టలేకపోయాయి. దీంతో బాగుందని చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అయితే అక్షయ్ కుమార్ మాత్రం యాక్టింగ్ పరంగా మరోసారి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే సాగదీసిన సన్నివేశాలతో పాటు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ క్వాలిటీతో లేకపోవడం వల్ల ఇంపాక్ట్ ఇంకా కిందకు వెళ్ళిపోయింది. ఈ ఘటన ఆధారంగానే 1993 బాలకృష్ణ నిప్పురవ్వలో ఒక కీలక ఘట్టం ఉంటుంది. ఇప్పుడు ఏకంగా సినిమానే తీశారు కానీ అక్కిని పాపం మళ్ళీ బ్యాడ్ లక్ పలకరించింది.