సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

తమిళ కథానాయకుడు సిద్దార్థ్ తన కొత్త చిత్రం ‘చిన్నా’ ప్రమోషన్ల కోసం బుధవారం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ప్రెస్ ఈవెంట్లో అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ చిత్రానికి థియేటర్లు అడిగితే ఇవ్వలేదని.. తెలుగులో సిద్దార్థ్ సినిమాలు ఎవరు చూస్తారు అని మాట్లాడారని చెబుతూ అతను దాదాపుగా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.

తమిళంతో ‘చిత్తా’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్కడ ఉదయనిధి స్టాలిన్.. మలయాళం, కన్నడలో పెద్ద పెద్ద సంస్థలు రిలీజ్ చేశాయని.. కానీ తెలుగులో మాత్రం ఈ పరిస్థితి వచ్చిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే తెలుగు వాళ్లు తనకు చాలా అన్యాయం చేసినట్లు అతను మాట్లాడటం కరెక్టా అన్నది ప్రశ్న. ఒకప్పుడు మన ప్రేక్షకులు అతణ్ని ఎలా నెత్తిన పెట్టుకున్నారో అందరికీ తెలుసు. సిద్ధుకు స్టార్ ఇమేజ్ వచ్చిందే తెలుగులో. కానీ అతను ఆ ఫాలోయింగ్, మార్కెట్‌ను నిలబెట్టుకోలేకపోయాడు.

సరైన సినిమాలు చేయక మొత్తం ఫాలోయింగ్ దెబ్బ తీసుకున్నాడు. తర్వాత తమిళంలోకి వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అతను ‘మహాసముద్రం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంత గ్యాప్ తర్వాత సిద్ధు నటించాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. చాలా ఏళ్ల తర్వాత సిద్ధు ఫ్యాన్స్ తన కోసమే ఈ సినిమా చూశారు. ఈ చిత్రం గురించి సిద్ధు గొప్పగా మాట్లాడాడు. తీరా చూస్తే ఆ మాటలకు.. సినిమాలో విషయానికి పొంతన లేదని తేలింది.

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో పలకరించాడు సిద్ధు. పీపుల్స్ మీడియా లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. దీని గురించి కూడా సిద్ధు గొప్పగానే చెప్పాడు. తీరా చూస్తే సినిమా చివరి వరకు కూర్చోవడం కూడా ప్రేక్షకులకు కష్టమైంది. ఇలాంటి సినిమాలు ఇచ్చి ప్రేక్షకుల నమ్మకం కోల్పోయాక.. ఇప్పుడో మంచి సినిమా చేసినా కూడా జనం థియేటర్లకు రావడం కష్టం. అందులోనూ ఈ వారం చాలా సినిమాలు రిలీజవుతున్నాయి. అలాంటపుడు థియేటర్లు దొరకడం ఈజీ కాదు. వాస్తవం ఇదైనపుడు సిద్ధు అంత ఎమోషనల్ అవడం ఏమిటో?