దొంగల ప్రపంచంలో ‘నాగేశ్వరరావు’ సంతకం

మాస్ మహారాజా స్పీడ్ ప్రస్తుతం ఎవరికీ లేదన్నది వాస్తవం. ఈ ఏడాది ప్రారంభంలో చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రవితేజ దసరాకి టైగర్ నాగేశ్వరరావుగా రాబోతున్న సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ స్టువర్ట్ పురం ప్రాంతానికి చెందిన ఒక నిజ జీవిత దొంగ కథతో వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇవాళ ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ట్రైలర్ లాంచ్ జరిగింది. అక్టోబర్ 20 విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజకు మొదటి ప్యాన్ ఇండియా మూవీ.

దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురం అనే ఊరు దొంగలకు ప్రసిద్ధి. ఎక్కడ ఎవరు లూటీలు చేయాలనేది ముందే వేలం పాట పాడుకుని మరీ దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. ఆ తెగకు చెందినవాడే నాగేశ్వరరావు(రవితేజ). భయం తెలియని వ్యక్తిత్వం. కొందరు చేసిన కుట్రల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పటిదాకా ఒకరి మాట వినే పరిస్థితి నుంచి దేనికైనా తెగించే స్థాయికి చేరుకుంటాడు. ఈ జాతిని వేటాడటమే పనిగా పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్(జిస్సుసేన్ గుప్తా)అక్కడికి వస్తాడు. ఈలోగా నాగేశ్వరరావు ఏకంగా సిఎం, పీఎంలు ఆలోచించే రేంజ్ కు చేరుకుంటాడు. అదెలానేది తెరమీద చూడాలి.

విజువల్స్ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ పనితనం, జివి ప్రకాష్ నేపధ్య సంగీతం పోటీ పడ్డాయి. రవితేజ గతంలో చూడని గెటప్ లో రెండు షేడ్స్ లో అదరగొట్టాడు. మనకు పరిచయమే లేని ఒక సరికొత్త నేర ప్రపంచంలోకి దర్శకుడు వంశీ తీసుకెళ్లిన తీరు థియేటర్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా నాజర్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ తదితరుల క్యాస్టింగ్ పెద్దదే ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా హాలీవుడ్ స్టాండర్ లో కనిపిస్తున్న టైగర్ నాగేశ్వరరావు విజయదశమికి అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.