ప్లానింగ్ దాచి పెడుతున్న డుంకీ 

నిన్న సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 ప్రకటించాక షారుఖ్ ఖాన్ అభిమానులు డుంకీ టీమ్ నుంచి అగ్రెసివ్ ప్రమోషన్లు ఆశిస్తున్నారు. యుఎస్ లో ప్రభాస్ డిస్ట్రిబ్యూటర్లు 1979కి పైగా లొకేషన్లలో స్క్రీన్లు లాక్ చేశామని ప్రకటించడంతో ఒక్కసారిగా ఓవర్సీస్ ట్రేడ్ అలెర్ట్ అయిపోయింది. అదే సమయంలో పెద్ద హాలీవుడ్ సినిమాలున్నా కూడా అంత భారీ స్థాయిలో థియేటర్లను పట్టడమంటే మాములు విషయం కాదు. ఎందుకంటే ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డంని నిర్మించిన వార్నర్ బ్రోస్ చాలా ముందస్తుగా బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకుని ఉంటుంది. కాబట్టి వ్యవహారం అంత తేలికగా ఉండదు.

ఇన్ని జరుగుతున్నా డుంకీ ప్రొడ్యూసర్లు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. పఠాన్, జవాన్ వరస బ్లాక్ బస్టర్ల తర్వాత ఒక్కసారి షారుఖ్ ఖాన్ మార్కెట్ అమాంతం లేచి కూర్చుంది. ఒకప్పుడు విదేశాలను ఏలిన బాద్షాకు మళ్ళీ పాత రోజులు వచ్చాయని అభిమానులు సంబరపడ్డారు. సహజంగానే డుంకీ మీద విపరీతమైన బజ్ వచ్చేస్తుంది. దానికి తోడు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో ఇవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. హైప్ ఎంత ఉన్నా సలార్ లాంటి డైనోసర్ ముందున్నప్పుడు దాన్ని ఎదురుకోవడానికి సరైన ప్రణాళిక ఉండాలి. కానీ ఎందుకనో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు

డుంకిని షారుఖ్ ఖాన్ నిర్మాణంలో భార్య గౌరీతో పాటు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, వయాకామ్ 18లు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. డిసెంబర్ 22కి కట్టుబడి ఉన్నామని షారుఖ్ పలు సందర్భాల్లో, ఇంటర్వ్యూలలో చెబుతున్నాడు కానీ మిగిలిన ఇద్దరి నుంచి దానికి సంబంధించిన ఎలాంటి మాట రావడం లేదు. వాయిదా పడొచ్చనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో ఉన్నప్పటికీ కింగ్ ఖాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నాడు. కంటెంట్ పరంగా చూసుకుంటే సలార్ లో ఉన్నంత యాక్షన్ మాస్ డుంకీలో ఉండదు కానీ అలాని మరీ తక్కువంచనా వేయడమూ సరికాదు.