16 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఆ కాంబినేషన్?

అక్కినేని నాగార్జునను నెవర్ బిఫోర్ అన్నట్లుగా చాలా కొత్తగా ప్రెజెంట్ చేసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించిన ఈ చిత్రానికి.. విడుదలకు ముందు బంపర్ క్రేజ్ వచ్చింది.

ఆ సినిమాలో నాగ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా, పూరి స్టయిల్లో కొంచెం తిక్క తిక్కగా ఉండి ప్రేక్షకుల్ని బాగా అలరించింది. సినిమాకు హైలైట్ హీరో పాత్రే. దీని తర్వాత నాగ్, పూరి కలిసి ‘సూపర్’ పేరుతో మరో భారీ చిత్రం చేశారు. కానీ ఆ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.

కానీ అందులోనూ నాగ్ చాలా కొత్తగా, స్టైలిష్‌గా కనిపించాడు. ఆ తర్వాత నాగ్-పూరి కాంబినేషన్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఐతే త్వరలోనే వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తున్నారని తాజాగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన పూరి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సినిమా పూర్తయి విడుదలయ్యేలా కనిపిస్తోంది. దీని తర్వాత పూరి చేయబోయే సినిమాల గురించి రకరకాల వార్తలొచ్చాయి.

ఆయన చిరు కోసం, బాలయ్య కోసం కథలు రాస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ కాంబినేషన్లు ఏవీ ఓకే కాలేదు. తాజా సమాచారం ప్రకారం పూరి.. నాగ్‌ కోసం కథ రెడీ చేశాడని.. అక్కినేని హీరో కూడా లైన్ విని ఓకే అన్నాడని.. వీళ్లిద్దరి కలయికలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈలోపు ‘వైల్డ్ డాగ్’తో పాటు ప్రవీణ్ సత్తారు సినిమాను కూడా నాగ్ పూర్తి చేస్తాడట.