19 ఏళ్ళ తర్వాత సినిమా చూస్తున్న హీరో

చేసింది అతి కొద్ది సినిమాలే అయినా 7జి బృందావన్ కాలనీ హీరోగా రవికృష్ణ అప్పటి యూత్ కి బాగా గుర్తుండిపోయాడు. ఆ తర్వాత నటించినవేవి ఆడకపోవడంతో చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అసలు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత దూరంగా చెన్నైలో ఉండిపోయాడు. తండ్రి నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు తీస్తున్నా సరే కనీసం దాని సెట్లలో కూడా కనిపించేవాడు కాదు. కట్ చేస్తే తనకు పేరు తెచ్చిన డెబ్యూ మూవీ కోసమే మళ్ళీ 19 ఏళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు రవికృష్ణ.

వచ్చే 22న రీ రిలీజ్ కాబోతున్న 7జి బృందావన్ కాలనీ కోసం టీమ్ ఏదో కొత్త విడుదల రేంజ్ లో ప్రమోషన్లు చేస్తోంది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో సహా టీమ్ ని పోగేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తోంది. శుక్రవారం అందరూ కలిసి సుదర్శన్ థియేటర్ లో షో కూడా చూడబోతున్నారు. విచిత్రమేంటంటే ఈ రవికృష్ణ ఇప్పటిదాకా ఈ సినిమా పూర్తిగా చూడలేదట. కేవలం కామెడీ సన్నివేశాలు, సునీల్ శెట్టితో ఉన్న ఎపిసోడ్లు, పాటలు తప్ప మళ్ళీ వీక్షించలేదట. ఎందుకయ్యా అంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ తనను బాగా కలవరపరుస్తుందని, అందుకే అంత ధైర్యం చేయలేకపోయానని చెప్పాడు.

షూట్ చేస్తున్న టైంలోనూ అనిత చనిపోయాక వచ్చే సన్నివేశాలు చేసి ఇంటికొచ్చాక గోడవైపు గంటల తరబడి చూస్తూ ఉండిపోవడం గమనించి అమ్మ భయపడిందని అందుకే దీనికి దూరంగా ఉన్నానని చెప్పాడు. ఫైనల్ గా ఇప్పుడు ప్రేక్షకుల మధ్య కూర్చుని పూర్తిగా చూస్తానని చెప్పాడు. అయినా ఒక హీరో తాను నటించిన బ్లాక్ బస్టర్ రెండు దశాబ్దాల పాటు చూడకపోవడం విచిత్రమే. అది కూడా కల్ట్ క్లాసిక్ లాంటి మూవీని. 7జి బృందావన్ కాలనీ 2ని వచ్చే నెల సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే మొదలుపెట్టబోతున్నారు. రవికృష్ణనే హీరోగా నటించబోతున్నట్టు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు.