ప్రోమోల్లో బూతులు.. ఇదో రకం పబ్లిసిటీ

‘బేబి’తో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుని మంచి ఊపున్న యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నుంచి త్వరలోనే మరో కొత్త సినిమా రాబోతోంది. అదే.. గంగం గణేశా. ఈ సినిమా మొదలైనపుడు.. మేకింగ్ దశలో పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. కానీ ‘బేబి’తో ఆనంద్ పెద్ద సక్సెస్ అందుకున్నాక ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. టాలీవుడ్లో ఎప్పట్నుంచో చూస్తున్న.. కొత్త దర్శకులు ఎక్కువమంది ప్రిఫర్ చేసే క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ అయితే ఆద్యంతం వినోదాత్మకంగానే సాగింది.

ఐతే ఇందులో ఎక్కువగా యూత్ దృష్టిని ఆకర్షించింది.. సోషల్ మీడియాలో వైలర్ అయింది మాత్రం.. చివర్లో వచ్చే ఒక డైలాగే. ‘‘చెప్పింది చెప్పినట్లు చేస్తే.. మీ వాటాలు మీ చేతిలో పెడతా’’ అంటూ విలన్ నార్త్ యాసలో డైలాగ్ చెబితే.. హీరో పక్కనున్న కామెడీ క్యారెక్టర్ ఆశ్చర్యపోయి చూస్తుంది. వెంటనే హీరో ‘‘అది వాటాలు’’ అని నొక్కి వక్కాణిస్తాడు. ఈ సీన్ ఉద్దేశం ఏంటన్నది అందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్‌ల్లో ఇలాంటి బూతులు ఈ రోజుల్లో చాాలా సాధారణం అయిపోయాయి.

ఇలాంటివి కుర్రాళ్లకు ఫన్నీగా అనిపించొచ్చు కానీ.. అబ్బాయిలు ఇలాంటి జోకులు వేసుకోవడం కూడా కామనే. కానీ ఈ జోకులు అలవాటైన వాళ్లకు కూడా సినిమాల్లో ఇలాంటి డైలాగులు వింటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇక అమ్మాయిలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉండగా ఇలాంటి డైలాగ్ వినిపిస్తే ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఐతే సినిమాలకు వచ్చేసరికి ఇలాంటి డైలాగులు ఎడిట్ అయిపోతుంటాయి. లేదా మ్యూట్ అవుతుంటాయి. ఈ మధ్య నాగశౌర్య సినిమా ‘రంగబలి’ ట్రైలర్లో కూడా ‘ఎవరైనా నా సంక ఎక్కాలని చూస్తే.. దింపి.. తా’’ అంటూ పచ్చి బూతు డైలాగ్ పేల్చాడు. అది సినిమాలో మ్యూట్ అయింది.

కానీ ట్రైలర్ రిలీజైనపుడు ఆ డైలాగ్ మీద చర్చ జరిగి పబ్లిసిటీకి ఉపయోగపడింది. అంతకుముందు ‘ఫలక్‌నుమా దాస్’లో కూడా ‘దెం..తే షేపవుట్ అయిపోతావ్’’ అంటూ ట్రైలర్లో పెట్టిన డైలాగ్ హాట్ టాపిక్ అయింది. ఇలాంటి డైలాగులు సినిమాల్లో పెట్టాలన్న ఆలోచన కూడా  ఒక్పపుడు వచ్చేది కాదు. కానీ ఇప్పుడేమో వీటిని నార్మలైజ్ చేసేస్తున్నారు. సినిమాల్లో డైలాగులు లేచిపోవచ్చు.. లేదా మ్యూట్ కావచ్చు. కానీ టీజర్, ట్రైలర్లకు సెన్సార్ ఉండదు కాబట్టి పబ్లిసిటీకి ఉపయోగపడతాయని ఇలాంటి డైలాగులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదో రకం పబ్లిసిటీ ట్రిక్ లాగా మారిపోయింది.