దత్తుగారి మాటలకు ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్

ఇటీవలే అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాలూకు పరిణామాలు మెల్లగా పరిశ్రమ మీద ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించడం లేదని నిర్మాత నట్టి కుమార్ వీడియో విడుదల చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. టిడిపి హయాంలో ఎన్నో ప్రయోజనాలు అందుకున్న పరిశ్రమ ఇప్పుడు కనీస స్థాయిలో రెస్పాన్డ్ కావడం లేదని పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాఘవేంద్రరావు లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు మౌనంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయంతో ఉన్నారు.

తాజాగా అగ్ర నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ చంద్రబాబుని ఇలా కేసులో ఇరికించడం అన్యాయమని, వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నేలమట్టం అవుతుందని జోస్యం చెప్పేశారు. నేరుగానే విమర్శలు గుప్పించారు. ఇది కాస్తా వైరలైపోయింది. మాములుగా తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి విషయంలో అధికార వైసిపి పార్టీ అవలంబించే వైఖరి పవన్ కళ్యాణ్ విషయంలో అందరూ స్పష్టంగా చూశారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లను పనిగట్టుకుని టికెట్ రేట్లతో మొదలుపెట్టి బెనిఫిట్ షోల దాకా ప్రతి విషయంలోనూ టార్గెట్ చేశారని ఫ్యాన్స్ ఇప్పటికీ తలుచుకుంటారు.

ఇప్పుడు దత్ గారి నిర్మాణంలోనే ఉన్న ప్రభాస్ ప్రాజెక్ట్ కె వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతోంది. ఖచ్చితంగా టికెట్ రేట్లు హైక్ అడగందే బడ్జెట్ రికవరీ జరగదు. ఎలాగూ సంక్రాంతి రేస్ లో లేదు కాబట్టి ఎలక్షన్లు అయ్యాక రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జగన్ మళ్ళీ రాడనే ఉద్దేశంతోనే దత్తు గారు అంత నిర్భయంగా కామెంట్లు చేశారని ఓ వర్గం అంటోంది. సపోజ్ ఒకవేళ దీనికి రివర్స్ జరిగితే అప్పుడు ప్రాజెక్ట్ కెకి ఏపీలో సమస్యలు తలెత్తుతాయని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి రాజకీయ వేడి ఇండస్ట్రీకి కూడా చాప కింద నీరులా అప్పుడప్పుడు తగులుతూనే ఉంది. చూడాలి ఏం జరగనుందో.