RRRని మెచ్చుకున్న బ్రెజిల్ ప్రెసిడెంట్

తెలుగు వాడి ఖ్యాతిని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్ ని బోలెడన్నిసార్లు చూసేసి మనం మర్చిపోయాం కానీ మిగిలిన ప్రపంచం మాత్రం ఎక్కడో ఒక చోట, ఏదో రూపంలో తలుచుకుంటూనే ఉంది. తాజాగా భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి20 సమ్మిట్ కు హాజరైన బ్రెజిల్ ప్రెసిడెంట్ లుల డి సిల్వ మాట్లాడుతూ తన దగ్గర ఎవరైనా ఇండియా ప్రస్తావన తెస్తే ముందుగా ట్రిపులార్ చూశారాని అడుగుతారని, అంత గొప్పగా తీసిన దర్శకుడికి నటించిన ఆర్టిస్టులకు శుభకాంక్షలు చెప్పారు. ప్రత్యేకంగా నాటు నాటు పాట గురించి ప్రస్తావించడం ఆశ్చర్యపరిచే విషయం.

దీన్ని బట్టే దేశాలు, హద్దులతో సంబంధం లేకుండా ఆర్ఆర్ఆర్ ఎంత దూరం ప్రయాణించిందో అర్థం చేసుకోవచ్చు. కెజిఎఫ్ టూ 1200 వందల కోట్లు సాధించవచ్చు. ఇప్పుడు జవాన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టొచ్చు. కానీ జక్కన్న లాగా ఒక ప్యాన్ ఇండియా మూవీని గ్లోబల్ స్థాయిలో పదే పదే చెప్పునేలా మాత్రం చేసుకోలేవు. జపాన్ లో అయిదు వందల రోజులకు పైగా ఆడి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ఆర్ఆర్ఆర్ ఎన్ని సంవత్సరాలైనా విదేశీయులకు అలాగే గుర్తుండిపోవడం ఖాయం. దీనికొచ్చిన స్పందన చూసే నెట్ ఫ్లిక్స్ సౌత్ సినిమాలను ఎగబడి కొనడం మొదలుపెట్టింది.

లులు డి సిల్వ ఇంతగా మెచ్చుకున్న ప్రత్యేక సందర్భాన్ని ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా షేర్ చేసుకుంది. ఈ లెక్కన మహేష్ బాబుతో రాజమౌళి త్వరలో మొదలుపెట్టబోయే ఫారెస్ట్ అడ్వెంచర్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో ఊహించడం కష్టమే. ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్న జక్కన్న త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు, లొకేషన్ హంట్ మొదలుపెడతారు. ఎంతలేదన్నా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకో ఎనిమిది పది నెలలు పట్టొచ్చని ఇన్ సైడ్ టాక్. గుంటూరు కారం తర్వాత మహేష్ కోసం అభిమానులు లాంగ్ వెయిటింగ్ చేయక తప్పదు.