బిచ్చగాడు టైమింగ్ చూసి కొడుతున్నాడు

తెలుగు ప్రేక్షకులకు వారానికి కనీసం రెండు మూడు కొత్త సినిమాలు లేకపోతే నడవదు. బాగుండటం లేకపోవడం తర్వాత సంగతి కనీసం ఏవో ఒకటి థియేటర్లకు వస్తే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటారు. అయితే సలార్ వాయిదా వల్ల తలెత్తిన అనూహ్య పరిణామాల వల్ల స్కంద, చంద్రముఖి 2లు తప్పుకుని విశాల్ మార్క్ ఆంటోనీ ఒకటే వినాయక చవితి బరిలో నిలబడింది. దీంతో వేరే ఆప్షన్ లేకుండా పోయింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలని మిస్ చేసుకున్నవాళ్ళు వాటికి ఓటేస్తారు కానీ కొత్త కంటెంట్ కోరుకునే వాళ్లకు మాత్రం విశాల్ ఒకడే కనిపిస్తున్నాడు.

ఈ గ్యాప్ ని వాడుకునేందుకు బిచ్చగాడు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 15న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించేశారు. నిజానికిది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. ఎలాగూ పాత సినిమాలు డబ్బింగ్ అయినా సరే బాగుంటే ఎగబడి చూస్తున్నారని సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3, రఘువరన్ బిటెక్ లాంటివి నిరూపించాయి. సో బిచ్చగాడుకి ఇదే రైట్ టైం అనుకుంటున్నారు. దీని బ్రాండ్ మార్కెట్ లో ఎంత బలంగా ఉందంటే విజయ్ ఆంటోనీ ఇమేజ్ దారుణంగా పడిపోయినా కేవలం ఈ బ్రాండ్ మీద సీక్వెల్ కి బిజినెస్ ప్లస్ లాభాలు వచ్చాయి.

సో బిచ్చగాడు ఆశపడటంలో తప్పు లేదు. కేవలం యాభై లక్షలకు హక్కులు కొంటే పాతిక కోట్లకు పైగా వసూళ్లు వర్షం కురిపించిన ఈ బ్లాక్ బస్టర్ కు ఇన్నేళ్లు గడిచినా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే మాస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా థియేటర్స్ లో డాన్సులు చేయడానికి, విజిల్స్ కొట్టడానికి అవసరమైన స్టఫ్ ఉండదు. తల్లి సెంటిమెంట్ తో పాటు అడుక్కునేవాళ్ళ బ్యాక్ గ్రోప్ వైరెటీగా వర్కౌట్ అయ్యింది. అమ్మా అమ్మా పాటను ఎమోషనల్ గా అప్పట్లో ఫీలయ్యారు కానీ ఇప్పుడదే భావోద్వేగం మళ్ళీ పుట్టించడం కష్టమే. చూడాలి మరి క్లాసిక్ గా నిలబడిన బిచ్చగాడు రీ రిలీజ్ లో అద్భుతం చేస్తాడో చేయడో.