ఆ ట్వీట్‌తో ఏం సాధించారు?

టాలీవుడ్లో రెండు దశాబ్దాలుగా నైజాం డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజుదే ఆధిపత్యం. ఆయన్ని కొట్టాలని కొందరు డిస్ట్రిబ్యూటర్లు చాలా దూకుడుగా డిస్ట్రిబ్యూషన్లో అడుగులు వేశారు. కానీ తర్వాత దెబ్బ తిని వెనుకంజ వేశారు. అందులో అభిషేక్ నామా కూడా ఒకరు. అభిషేక్ పిక్చర్స్ పేరు మీద ఒక టైంలో చాలా దూకుడుగా సినిమాలు కొని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు అభిషేక్. తర్వాత అతను నిర్మాణంలోకి కూడా వచ్చాడు.

గూఢచారి, సాక్ష్యం, రావణాసుర సహా పలు చిత్రాలు నిర్మించాడు. కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ, నిర్మాణంలో కానీ అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయాడు. దిల్ రాజులా అందరికీ జడ్జిమెంట్ ఉండదని.. డిస్ట్రిబ్యూషన్ అంత తేలికైన విషయం కాదని చెప్పడానికి అభిషేక్ కూడా ఒక ఉదాహరణ.విజయ్ దేవరకొండ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న అభిషేక్.. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఏకంగా 8 కోట్లు నష్టపోయాడట.

ఐతే దీనికి నష్టపరిహారం పొందాలని అభిషేక్ ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ప్రొడక్షనే ఆపేసిన కేఎస్ రామారావు.. చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో భాగస్వామిగా మారడంతో ఆ సినిమా రిలీజ్ టైంలో తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్నాడు. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా.. పోస్టర్ల మీది నుంచి రామారావు పేరు ఎగిరిపోయింది. నిజంగానే ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా.. రిలీజ్ సమస్యలు తప్పవని తప్పించారా అన్నది తెలియదు కానీ.. అభిషేక్‌‌కు మాత్రం సెటిల్మెంట్ జరగలేదు.

ఐతే డిస్ట్రిబ్యూషన్లో లాభాలు వస్తే నిర్మాతకో, హీరోకు అందులో వాటాలు ఇవ్వడం జరగనపుడు.. నష్టం వస్తే వాళ్లు సెటిల్మెంట్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. కాకపోతే మ్యూచువల్ ట్రస్ట్ మీద, మానవతా దృక్పథంతో నిర్మాతలు కొన్నిసార్లు పరిహారం చెల్లిస్తుంటారు. ఈ రకంగా ఏదో సెటిల్ చేసుకోవాలి కానీ.. హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’కి తాను అందుకున్న రెమ్యూనరేషణ్ నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్న అభిమానులకు ఏదో కొంత సాయం చేస్తుంటే ఆ విషయం ప్రస్తావిస్తూ.. తమకు సెటిల్మెంట్ గురించి అతణ్ని ట్విట్టర్ వేదికగా నిలదీశారు అభిషేక్ పిక్చర్స్ అధినేతలు.

ఈ ట్వీట్ తీవ్ర దుమారమే రేపింది. నెటిజన్ల నుంచి ఏమాత్రం సానుకూల స్పందన రాలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సంస్థకు న్యాయం చేయాలని మద్దతుగా నిలవకపోగా.. హీరోను, అది కూడా ట్విట్టర్లో నిలదీయడం ఏం పద్ధతి అంటూ అందరూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీస సానుభూతి రాలేదు. ఈ చర్య వల్ల ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వారికి మద్దతుగా సెటిల్మెంట్ కోసం ఎవరూ మందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి ఈ ట్వీట్‌తో అభిషేక్ పిక్చర్స్ సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.