చిరు దాన్నే మొదలుపెట్టేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది మిశ్రమానుభూతులను మిగిల్చింది. ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్ల పరంగా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ ఇంకో ఏడు నెలలకే ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. ‘భోళా శంకర్’ సినిమా చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్లో కూడా ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం చిరుకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. ముందు ఆయన వేసుకున్న ప్రణాళికలను కూడా దెబ్బ తీసింది.

మామూలుగా అయితే కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాను ఈపాటికే సెట్స్ మీదికి తీసుకెళ్లాల్సింది. కానీ ‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత కొత్త సినిమాల విషయంలో చిరు జాగ్రత్తగా అడుగులు వేసే క్రమంలో ఆ చిత్రాన్ని హోల్డ్ చేశాడు. స్క్రిప్టు మీద మళ్లీ పని చేయిస్తూ.. పూర్తి సంతృప్తికరమైన ఔట్ పుట్ వచ్చాకే ఆ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు చిరు. దీంతో అసలీ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.

చిరు పుట్టిన రోజు నాడు కూడా ఈ సినిమాను అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మరోవైపు మల్లిడి వేణు అలియాస్ వశిష్ఠ సినిమా నుంచి మాత్రం ప్రకటన వచ్చేసింది. యువి క్రియేషన్స్ నిర్మించే ఈ సోషియో ఫాంటసీ మూవీ నుంచి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

కళ్యాణ్ కృష్ణ సినిమాను చకచకా పూర్తి చేసి.. ఆ తర్వాత వశిష్ఠ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చిరు అనుకున్నాడు. కానీ ఇప్పుడు చిరు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. కళ్యాణ్  సినిమా సంగతి మరి కొన్ని రోజుల్లో తేలకపోతే.. దాన్ని పక్కన పెట్టి వశిష్ఠ సినిమా షూటింగ్ మొదలుపెట్టేయాలని చూస్తున్నారట. అక్టోబరు చివరి వారంలో లేదా నవంబరు ఆరంభంలో ఈ సినిమా మొదలైపోతుందని సమాచారం.