ధృవ మిస్ చేసుకున్న ప్రభాస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ మూవీస్ లో ఖచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి దాన్ని తీర్చిదిద్దిన తీరు ఇక్కడా సూపర్ హిట్ అందించింది. అయితే ఒరిజినల్ సృష్టికర్త మోహన్ రాజా దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే మొదట ఈ కథ రాసుకున్నది ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకునట. స్టోరీ చెప్పడం పూర్తయ్యాక తాను ప్రస్తుతం ప్రేమకథ చేసే ఆలోచనలో ఉన్నానని, ఇప్పుడీ పోలీస్ డ్రామా చేయలేనని చెప్పడంతో మోహన్ రాజా చెన్నైకి తిరిగి వెళ్లిపోయారు.

ఈలోగా నాగార్జున ఆజాద్ ని విజయ్ తో తీసే అవకాశం రావడంతో దాన్నే వేలాయుధంగా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ తని ఒరువన్ ని బయటికి  తీసి ఎవరెవరినో అడగటం ఎందుకు, తమ్ముడు జయం రవితోనే చేస్తే పోలా అని అలోచించి వెంటనే ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాడు. కెరీర్ లో మోహన్ రాజా మొదటి స్ట్రెయిట్ మూవీ అదే. నయనతారని హీరోయిన్ గా తీసుకుని అరవింద్ స్వామిని విలన్ గా చేసి క్రేజీ క్యాస్టింగ్ తో తక్కువ టైంలో పూర్తి చేసి ఆ ఏడాది పెద్ద హిట్స్ లో ఒకటి అందుకున్నాడు. దాన్నే అల్లు అరవింద్, చిరంజీవి చూసి నచ్చేసి హక్కులు తెచ్చేసుకున్నారు.

ఒకవేళ ధృవ కనక ప్రభాస్ చేసుంటే ఎలా ఉండేదన్న ఊహే ఫ్యాన్స్ ని తెగ బాధ పెడుతోంది. ఎందుకంటే అలాంటి కథలు అరుదుగా వస్తాయి. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా అన్ని వర్గాలను మెప్పించే స్కోప్ ఉన్నవి రావడం లక్కే. అన్నట్టు తని ఒరువన్ 2ని రెడీ చేసిన మోహన్ రాజా దాన్ని రామ్ చరణ్ కి వినిపిస్తాడా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ నిజంగా కథ బాగుంటే మాత్రం సమాంతరంగా చేయడం మంచిది. అక్కడ హిట్టయ్యాక చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అసలే మెగా ఫ్యాన్స్ రీమేక్ అనే పదం వినపడితే చాలు కస్సుమంటున్నారు.