RX 100-2 ప్లానింగ్‌లో ఉందా?

తెలుగులో చిన్న బడ్జెట్లో, పెద్దగా పేరు లేని ఆర్టిస్టులతో ఓ కొత్త దర్శకుడు తీసిన ‘ఆర్ఎక్స్‌ 100’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించాడు. రెండు కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. 20 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టడం విశేషం. దీన్ని బట్టే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు.

ఐతే ఈ సినిమా తర్వాత అందులో భాగమైన అందరికీ అవకాశాలు బాగానే వచ్చాయి కానీ.. ఎవ్వరూ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. హీరో కార్తికేయ నుంచి దాదాపు పది సినిమాలు వచ్చినా ఏదీ ఆశించిన సక్సెస్ కాలేదు. పాయల్ రాజ్‌పుత్ కెరీర్ అయితే తిరోగమనంలో ఉంది. దర్శకుడు అజయ్ భూపతి కూడా ‘మహాసముద్రం’తో తీవ్రంగా నిరాశ పరిచాడు.

ఐతే ‘మంగళవారం’ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అజయ్, పాయల్ చూస్తుంటే.. ‘బెదురులంక 2012’ మీద కార్తికేయ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాల ఫలితం ఏమో కానీ.. అజయ్-కార్తికేయ కాంబినేషన్లో ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ లాంటి సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజయ్‌తో మళ్లీ తాను ఓ సినిమా చేస్తున్నట్లు కార్తికేయ వెల్లడించాడు. ఈ సినిమా ‘ఆర్ఎక్స్-100’ సీక్వెల్ కచ్చితంగా చెప్పాలేనని.. మళ్లీ తమ కలయికలో ఒక సెన్సేషనల్ సినిమా ఉంటుందని అతనన్నాడు.

ప్రస్తుతం రకరకాల కథల మీద చర్చలు జరుగుతున్నట్లు అతను చెప్పాడు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తాను కొన్ని కథల విషయంలో తప్పు చేశానని.. కొన్ని మంచి కథలు కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని కార్తికేయ తెలిపాడు. ‘బెదురులంక 2012’తో తాను కచ్చితంగా గాడిలో పడతానని.. ప్రేక్షకులు ఊహించలేని సర్ప్రైజ్‌లు ఈ సినిమాలో చాలా ఉంటాయని అతనన్నాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.