రాష్ట్రాల ముఖ్యమంత్రులే రజనీ అభిమానులు

మాములుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పాలనా వ్యవహారాలకే టైం సరిపోదు. ఇక సినిమాల మాట దేవుడెరుగు. ఎంత ఇష్టమున్నా సరే ప్రజా జీవితం కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ టెంప్టేషన్ నుంచి తప్పించుకోవడం కుదరదు. జైలర్ కు అలాంటి పరిస్థితి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్న రజనీకాంత్ మానియాకు సిఎంలు కూడా మినహాయింపు కాలేకపోతున్నారు. ముందు తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రత్యేకంగా చూశారు. వ్యక్తిగతంగా తలైవర్ తో ఉన్న అనుబంధం కన్నా హీరోగా ఆయనంటే ఉన్న ఇష్టం వల్ల వీలు చేసుకుని మరీ షో వేయించుకున్నారు.

తర్వాత కొద్దిరోజులకే కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ ఇంట్లో కాకుండా అదే పనిగా త్రివేండ్రంలో ఉన్న పివిఆర్ మల్టీప్లెక్సుకు తన కుటుంబంతో వెళ్లి చూశారు. స్టేట్ హెడ్డే వస్తే ఇక థియేటర్ యాజమాన్యానికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్ జైలర్ ని చూడాలని నిర్ణయించుకున్నారు. హిమాలయ యాత్రను పూర్తి చేసుకున్న రజనీకాంత్ స్వయంగా ఆయనతో కలిసి తన సినిమా చూసేందుకు నిన్న లక్నో చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో కలిసిన మీడియాకు ఈ విషయం రజనినే చెప్పడంతో బయటికి వచ్చింది.

అన్ని వర్గాల ఆడియన్స్ ని జైలర్ ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. గతంలో రజనీకాంత్ ఎన్నో సినిమాలు విపరీతమైన హైప్ తో రిలీజైనప్పటికీ ఇంతగా సీఎంలు, ఎమ్మెల్యేలు చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం అయిదు వందల కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న జైలర్ ఫైనల్ రన్ అయ్యేలోపు తమిళనాడు హయ్యెస్ట్ గా నిలవడం ఖాయమని బయ్యర్లు బల్లగుద్ది చెబుతున్నారు. 2.0 పేరు మీద ఉన్న రికార్డులను జైలర్ బద్దలు కొట్టేలానే ఉంది. తెలుగులోనూ ఇప్పటికే మూడింతల లాభాన్ని ఖాతాలో వేసుకుని జోరు కొనసాగిస్తోంది