చిరుపై విష ప్రచారానికి నిర్మాత బ్రేక్

కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్‌కు మకుటం లేని మహారాజులా ఉన్నాడు చిరు. ఆయన ఉన్నంత వరకు రికార్డులన్నీ తన పేరు మీదే ఉండేవి. కానీ సినిమాల నుంచి పదేళ్లు బ్రేక్ తీసుకుని.. తిరిగి వచ్చే సమయానికి పరిస్థితులు మారాయి. కొత్త సూపర్ స్టార్లు వచ్చారు. కొత్త రికార్డులు నమోదయ్యాయి. అయినా సరే.. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పిన ఘనత చిరుకే సొంతం. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో మళ్లీ తన సత్తాను చూపించాడు.

కానీ ఇప్పుడొచ్చిన ‘భోళా శంకర్’ మెగా అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లింది. చిరు కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా అనేక రకాలుగా విమర్శలకు గురైంది. ఇదే అదనుగా చిరు మీద తీవ్ర స్థాయిలో దుష్ప్రచారానికి తెరతీశాయి మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు. సినిమా ఫలితం ఏమైనా సరే.. తన పారితోషకం తనకు ఇవ్వాల్సిందే అంటూ ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకరను చిరు ఇబ్బంది పెడుతున్నట్లుగా రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

చిరు కోసం తన ఫామ్ హౌస్‌ను కూడా అనిల్ అమ్మేస్తున్నట్లు వార్తలు పుట్టించేశారు. ‘ఆచార్య’ సమయంలోనూ ఇలాంటి ప్రచారాలే జరిగాయి. కానీ ఆ సినిమాకు తనతో పాటు రామ్ చరణ్ పారితోషకం నుంచి మెజారిటీ షేర్‌ను చిరు వెనక్కి ఇచ్చేసిన విషయం తర్వాతే వెల్లడైంది. ఇక ‘భోళా శంకర్’ విషయంలో చిరు లాంటి అంత దారుణంగా వ్యవహరిస్తాడని ఆయనేంటో తెలిసిన వాళ్లెవ్వరూ ఆలోచించరు. కానీ యాంటీ ఫ్యాన్స్ ఈ ప్రచారాలను ఉద్ధృతం చేస్తున్నారు. వీరికి స్వయంగా నిర్మాత అనిలే చెక్ పెట్టారు. మీడియాలో వస్తున్న న్యూస్‌ను షేర్ చేసి అనిల్‌కు ఫార్వార్డ్ చేసిన ఒకతను ఇది నిజమేనా అని అడిగితే.. ఆయన ఇలాంటివి పట్టించుకోవద్దని తేల్చి చెప్పడం విశేషం. అంతే కాక చిరు గొప్ప మనిషి అని.. ఆయనతో తాను మరో సినిమా కూడా చేయబోతున్నానని అనిల్ చెప్పడం గమనార్హం.