మెగాస్టార్ కొత్త సినిమా కబురొచ్చింది

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత చిరు తన కూతురు సుశ్మిత నిర్మాణంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల రూపొందించే చిత్రంలో నటిస్తారు. ఇది మలయాళ హిట్ ‘బ్రో డాడీ’కి రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేసినట్లు చెబుతున్నారు.

ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో మాట్లాడుతూ.. ఈ చిత్రంతో పాటు యువి క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమా చేయనున్నట్లు చిరు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం నిర్మాణ సంస్థ గురించి చెప్పాడే తప్ప.. అంతకుమించి వివరాలేమీ వెల్లడించలేదు చిరు. నిజానికి ముందు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సంస్థలో చిరు సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు ఓకే కాక వెంకీ బయటికి వెళ్లిపోయాడు.

ఇప్పుడు వెంకీ స్థానంలోకి ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వేణు అలియాస్ వశిష్ఠ వచ్చినట్లు తెలుస్తోంది. అతడి స్క్రిప్టుకు కూడా చిరు ఓకే చెప్పాడట. ఇదొక సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కబోయే సినిమా అని సమాచారం. ప్రభాస్‌తో చేసిన భారీ బడ్జెట్ సినిమాలు ‘సాహో’ ‘రాధేశ్యామ్’ తీవ్రంగా నిరాశ పరచడంతో ప్రొడక్షన్లో జోరు తగ్గించిన యువి సంస్థ.. మళ్లీ చిరు చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది.

దీని మీద పెద్ద బడ్జెట్ కూడా పెట్టబోతోంది. కళ్యాణ్ కృష్ణ సినిమాను దాదాపుగా పూర్తి చేసిన తర్వాత చిరు ఈ చిత్రాన్ని మొదలుపెడతాడట. నవంబరు లేదా డిసెంబరులో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుకుని.. త్వరలోనే ప్రి ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ప్రయత్నంలో ఉంది టీం. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశముంది.